6, మే 2025, మంగళవారం

ముకుందుడు మెట్ట్లు ఎక్కుతున్నారు..

మన తెలుగు నాట ఒక సాంప్రదాయం వున్నది...
అది ఏమిటంటే...గృహంలో వున్న శిశు బాలకుడిని... శ్రీకృష్ణ అంశగా భావన....
ఆయన ప్రసాదమని.... శ్రీకృష్ణ రూపుడనే భావనతో... శ్రీకృష్ణుని పరంగా శిశువు ఎదిగే క్రమంలో...నిత్య క్రియలు సందర్భంగా... శ్రీకృష్ణుని కి అన్వయం చేస్తూ అనేకానేక కీర్తనలు...పాటలు...పద్యాలు వున్నవి....
ఇది మన తెలుగు నాట కాదు యావత్ దేశంలో వున్న భావన....
అందుకు అనేకానేక ఉదాహరణలు వున్నాయి...
మొట్ట మొదటి ఉదాహరణ....
సూరదాస్...ఈయన పుట్టు అంధుడు....కాని ఈయన రచనలలో బాలక్రిష్ణుని వర్ణన  ఎంత మధురంగా వుంటదంటే...సాధారణ ప్రజలు ఆవర్ణన పుట్టు అంధుడు చేశాడు అంటే నమ్మలేనంత.... అందుకే ఆయన స్మృతి పధం లో సదా శ్రీకృష్ణుడు నాట్యం ఆడుతున్నారని వాడుక...
తమిళనాట  వెంకట కృష్ణకవి వున్నారు... కాకపోతే  వీరు సంస్కృతం లో రచన....
తెలుగు నాట క్షేత్రయ్య.....
మహారాష్ట్ర లో అయితే విఠలుని పరంగా గుర్తించ తగిన మంది భక్తులు వున్నారు....
గుజరాతి లో వున్నారు...
ఇక బెంగాల్ ప్రాంతం అయితే... శ్రీచైతన్యులు....
ఇక ఈయనను అయితే శ్రీకృష్ణుడు మరలా ఈ రూపంలో లో జన్మించారు అంటారు...
ఇలా అనేకానేక....ఉదాహరణలు...
అసలు మన మోక్ష ప్రదాయక గ్రంధం...
శ్రీ మహాభాగవతంలో వ్యాసుల వారు దశమ స్కంధం మొత్తం శ్రీకృష్ణుని లీలా వైభవం....
పోతన గారు కూడా యధావిధిగా కొనసాగించారు...
ఆనాడు ద్వాపర యుగ సందర్భం గా శ్రీకృష్ణుని లీలా వైభవం మనం స్వయంగా చూడలేదు...
అందుకే మన శిశు బాలుడిని  శ్రీకృష్ణునిగా భావన...మన ఇల్లు గోకులం అయితే అనుకుంటే...
ఇక మన ఒడిన వున్నవాడు....స్వయంగా ఆయనే....
అందుకే మా దౌహిత్రుడైన ముకుందుడు ను నేను క్రిష్ణ రూపంగా పాటలు పాడేది....
కాకపోతే నేను ఇక్కడ మీకు తెలిపేది....రాబోవు రోజుల్లో మీరు కూడా ఈ సాంప్రదాయం పాటిస్తారనే భావన...
ఇక ఇక్కడ నేను తెలుపు తున్న చిన్న పాట....
మనవడు మొదటి సారిగా మెట్లు ఎక్కు తున్నారని...మా అమ్మాయిగారు పంపిన వీడియో చూడగానే నా నుండి వచ్చిన అప్రయత్న స్పందన....
వడి వడి నడకల శ్రీకృష్ణ 
వడి వడి నడకల శ్రీకృష్ణ 
పడి ఎరు పరంధామ పురుషోత్తమ 
పడి ఎరు పరంధామ పురుషోత్తమ...
వడి వడి నడకల శ్రీకృష్ణ
+++
వడి = వేగంగా 
పడి = మెట్టు
ఎరు = ఎక్కుట
+++
వడి తెలుగు పదమే....
పడి , ఎరు - ఈ రెండు పదాలు ద్రావిడ పదాలు అంటే తమిళ పదాలు...

4, మే 2025, ఆదివారం

జీవన తరంగాలు 1

భరించలేని గుండే కోతగా వున్నది...
ఏమిటో తెలుసు ఎందుకో తెలుసు కాని ఆశక్తుడను...ఆ బాధ గుండే దాటి పోవటం లేదు....ఇది నాలోని అంతర్మధనం...ఇది అలాగే కొనసాగుతుంది....
నిరుత్తరత అనే పదానికి అర్ధం అనుభవం లోకి వస్తుంది....
మౌనంగా నాలోకి నేను కుచించుకు పోవటమా...ఒదిగి పోవటమా....
అంతర్మధనం చెందటమా...ఎమో నాకు తెలియదు...ఎదో జరుగుతుంది....
అది ఆపని...ఆపుకోలేని వెల్లవలా కమ్ముతున్నది...ఎంత ప్రయత్నించినా...ఎంత అదిలించినా...బెదిరించినా...అంతకు రెట్టింపు బలంగా సునామిలా....వేసవి గాడ్పులా... అమావాస్యపు చీకటిలా....చిక్కటి పొగలా నన్ను ఆవహిస్తున్నది...ఆక్రమించుతుంది....
కోమాలో వున్న వ్యక్తి జీవించే వుంటాడు నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేయలేడు. నేను కూడా రివర్స్ కోమాలో వున్నాను. నిత్య నైమిత్తిక క్రియలు జరుగుతున్నాయి. వ్యక్తిగా నా భాధ్యత లు నేను నిర్వర్తించ లేను...
ఇది ఒక విధమైన నిర్లిప్తత కు దారితీస్తుంది....ఈ మానవ ప్రపంచపు సమూహాలలో నాది మాత్రం కదిలే ఏకాంతర వాసం....నాలో నేను...
నాతో నేను...ఇది కధ...ఇది వ్యధ...
ఇది మూర్ఖత్వమా అమాయకత్వమా తెలియదు...నాన్నగారి ప్రభావం ఇంకనూ విడవకున్నది....
ఆయన నడిచిన మార్గం ఇంకనూ నాకు పచ్చగానే కనపడుతున్నది...ఆయనకు ఇచ్చిన మాట మరచిపోలేకున్నది...
ఆయన కదలిక...ఆయన మాట... స్మృతి పధం వీడనంటున్నవి....
ఆయన నా బలం...నా బలహీనత...
ఆయన కుటుంబంని ధృడంగా పట్టుకోవటం నేర్పారు....సంతానం పై ప్రేమ అనురాగం నేర్పారు....అన్నిటి కన్నా ముఖ్యంగా ఆయన నన్ను నమ్మారు....దీనికి ఋజువులు ఉదాహరణలు లేవు...ఆయన మనస్సు...నా మనస్సు తప్ప...
నాన్న నాకు చాలా కొత్తగా దర్శనం ఇచ్చింది ...30-04-1994 న అంటే నమ్ముతారా....ఆయన అంత బేల అవటం....ఆయన నుంచి నేను విడిపోవటం...జీవనం గురించి విజయవాడ కుటుంబం షిఫ్ట్ అవుతున్న సమయంలో ఆయన వేదనకి సాక్ష్యం నా మనస్సు...ఆరోజు ఆయన నన్ను పట్టుకున్న తీరు....
గృహప్రవేశం మరికొద్ది సమయంలో ప్రారంభం అవుతున్న సమయంలో ఆయన అభిమానంగా దగ్గరకు తీసుకుని...నా నుదురుపై ఆయన పెదవులతో స్పృశించిటం...అది ప్రేమ...అభిమానమా... ఆప్యాయత....జీవితపు ఆఖరి క్షణంలో ఆయన నాపై చూపిన అపార నమ్మకం....తీసుకున్న వాగ్దానం....
ఇలా అనేకం...
ఇలా వీటి అన్నీటికి జవాబులా.....
నా మనవడు గారిని మా నాన్నగారు గా భావన చేయాలనే సంకల్పం, పట్టుదల....
( ఆయన పేరు పెడతారా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు) ఆయన లాంటి ఉదాత్తుడును...శిశువుగా నా ఒడిలో కూర్చొనబెట్టి మురిసి పోవాలని....
కాల చక్రభ్రమణం అంటే అర్ధం ఇది అని తెలుసుకోవాలనే తపన.... ఆశ...
అలాగే...వంశపు పెద్ద మనవడి గా నేను అనుభవించిన హోదా....ముద్దు ముచ్చట...మా వంశపు రాబోవు మనవడికి అందించాలనే భాధ్యత సంకల్పం...
ఇది మా పెద్ద నాయనమ్మ గారు..
కీ.శే. శ్రీమతి ఆలపాటి రావమ్మ గారు అందించారు.....ఆమే నాకు ఊహ వచ్చు వరకు 1979 వరకు జీవించారు కనుక..ఆమే నన్ను ఎంత ప్రేమించారు అభిమానించారు అనేది నాకు మాత్రమే అనుభవం...
అలాగే మా తాతగారు శ్రీరాములు గారు.... అయితే వీరిది కొంత విలక్షణ ప్రేమ...ఇలా మనవడిగా నేను పొందిన ఆప్యాయత....నా తదనంతర తరాలకి అందించాలనే తపన.
అందుకే హితం అని భావించిన ప్రతి చిన్న ప్రయత్నం ని వదలక పట్టుకోవటం.
సంసార సాగరపు మధ్యన...ఏ చిన్న గడ్డి పోచ లాంటి ఆధారం చిక్కిననూ....అది హితం అని నమ్మితే దానిని ప్రతిపాదన చేస్తున్నా....
కాక  పోతే లౌకిక భావనలు దృష్ట్యా ఆ ప్రతిపాదనలు వీగి పోవటమో లేక నిరాదరణకు గురి అవటమో లాంటి చర్యలుకి గురి అవుతున్నాయి....
ఏమో కాలరూపుడైన శివుడు నాతో ప్రతి రోజు ఆరాట పోరాట ఆట....ఆడిస్తున్నాడు...ఆట గదరా శివ...ఆట...
అంటే....బాధ్యత శూలపు కొనతో తట్టుతూ ... పరిహాసం ఆడుతున్నాడు...
రోజు ఉదయించే కాలపు మలుపులో నీవు గెలుస్తావు అనే నమ్మకం ఇస్తున్నాడు.... రాత్రికి...నిద్రపోయే సమయానికి.... జీవన అనుభవపు ఎత్తులు జిత్తులు తప్పులు వెరసి అన్నీ కలిసి....మనిషి, మనస్సు అలసి పోయి , సొలసి పోయి , డస్సి పోయి...ఒరే బడుద్దాయ్! అని శివుడి పరిహాసం....
ఇది కథ..
ఇదే కథ...
ఇంతే కథ...
వెరసి...
నాలో నేను...
నాతో నేను....



2, మే 2025, శుక్రవారం

మురళి మనోహర గోపాల

మురళిమనోహర గోపాల
రాధ మాధవ గోపాల
పరమ పురుష గోపాల 
భాగవతోత్తమ గోపాల 
మోక్షప్రదాయక గోపాల
గోపిక ప్రియనే గోపాల 
గోరూపధార గోపాల
కేళి లోల గోపాల 
ధర్మరక్షక గోపాల 
చక్రధారి గోపాల
మునిగణ వందిత గోపాల 
సర్వ జన ప్రియనే గోపాల
కుచేల సఖనే గోపాల
అనాధ నాధ గోపాల
ఆపద రక్షక గోపాల



26, ఏప్రిల్ 2025, శనివారం

మనవడు ఊరు వెళ్ళితే

పెళ్ళి వారి ఇల్లు లా బోసి పోయింది....
స్థబ్దుగా గంభీరంగా వున్నది....
స్వామి వారితో విడియో కాల్ మాట్లాడి నప్పుడు తప్ప, మిగిలిన సమయాల్లో ఏమిటో కేశవ నామాలు , పాటలు మాయమైనవి.... అమ్మమ్మ , జేజమ్మ ఏమిటో వెలితితో నిద్ర పోతున్నారు...
పిల్లవాడికి నూనే పెట్టమనే  హెచ్చరికలు లేవు.....ఇటు నుంచి అటుకు మార్పులు లేవు...
మధ్య రాత్రిలో దేవతా సందర్శనంలా...
స్వామి వారు మసలటం కాని....
వారి చిరుమువ్వల సవ్వడి కాని లేవు...
మధ్య రాత్రి గుండెల నిండుగా శ్వాస పీల్చుకొని మెల్లగా నిదానంగా కృష్ణా అని పిలవటం లేదు ఏమిటో గొంతు మూగబోయినట్లు అయినది....
ఉదయాన్నే అర్జేంట్ గా రైలు కోసం హడావుడి పడినట్టు ....ఆచ్ బై లు....ఉదయాన్నే ఇడ్లి తీసుకు రావటం మాయం....
సాంబార్ తీసుకు రండి కొద్దిగా అన్నా తింటాడు అనే హెచ్చరిక లేదు...
ఈరోజు ఏ పండు పెట్టాలనే చర్చ లేదు....
రాత్రి షాపు నుంచి త్వరగా రావాలనే ధ్యాస లేదు.....ఇడ్లి పిండికి వెళ్ళేటప్పుడు.... స్వామి వారి నగరోత్సవ సేవ లేదు.....
ఎక్కడి సామాను అక్కడే.....అదేమిటో మరి స్వామి వారు వున్నప్పుడు అన్నీ వస్తువులు కి చైతన్యం ఆవహించి....నడిచి వచ్చినట్టుగా అన్నీ హాలులో ఆయన అనుగ్రహించే వారు...
ఆనాటి కృష్ణుడు కి చుట్టుతా గోవులు వుంటే...ఈ కృష్ణుడు చుట్టుతా మేమంతా....
కృష్ణుడు ద్వారక కి వెళ్ళిన తరువాత గోకులంలోని వారి పరిస్థితే మాది....
మనుషులం ఇక్కడ మనస్సు అక్కడ....
నిన్న ఉదయం వచ్చిన నుంచి మీ అమ్మ గ్యాలరిలో మీ ఫోటోలు, స్వామి వారి వీడియో స్నిప్పెట్ చూడటం....మురిసిపోవటం....మరలా అంతలోనే చేయినది ఏమి లేక చేయలేక దిగులుగా వుండటం....
ఇది రెండు రోజుల్లో  మౌనంగా మారుతుంది మరీ రెండు రోజుల్లో గంభీరంగా మారుతుంది... తరువాత ఏమిటి అనేది నాకు గుబులుగా వున్నది.....
ఏమిటో మహాలక్ష్మీ కి తెలియని ఒపిక ఉత్సాహం వచ్చినవి... లేకపోతే తొందరగా బయటకు కదలటానికి సుముఖత చూపని ఆమే .... స్వామి వారి కోసం ఇటునుంచి రైలులో వెళ్ళి మరలా అదే రైలులో స్వామి వారితో తిరుగు ప్రయాణం అయినది.....
తిరువళ్ళూర్ నుంచి వచ్చి....48 గంటలు గడవక ముందే హడావుడి గా ఇల్లు సర్ది ప్రయాణం కి కావలసిన సకల సామానులు సకల సంబారాలు వేగవేగంగా ఏర్పాటు....ఏమిటో మంత్రి గారు పర్యటన కి వస్తే హైరనా పడే సాధారణ ప్రజానీకం లా .... మహాలక్ష్మి మొత్తం పైది క్రిందకు, క్రిందది పైకి చేయాలనే బృహత్ ప్రయత్నం....
మహాలక్ష్మి ఎన్నడు నాతో చెప్పదు....
ఇది చేయమని....కాని....
ఏమిటో ఆమే లక్షణం నాకు తెలిసినదా....ఆమే మనస్సు నాకు అవగాహన అయినదా....మీరే అంచనా వేసుకోవాలి..... అందుకే సతీష్ ని రైలులో తిరుగు ప్రయాణంలో మా అమ్మాయి దిగి బుధవారం వస్తుంది అని రిక్వెస్ట్....
అందుకే కారు మాట్లాడేది....
ఆమే సంతోషంగా ఆనందంగా వుంటే ఆర్ధిక భారం అనిపించదు చేయలేను అనే ధ్యాస వుండదు....అది ఆమే కోసం చేయాలనే లక్ష్యంతో పట్టుదలతో ముందుకు వెళ్ళటమే.....
ఇవి గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహరం....
కృష్ణా.....అందరి దుఃఖాలను తీర్చు వాడివి....వేదనను దూరం చేసేవాడివి....
సకల సంతోష ప్రదాతవు......
నా బాధ, ఆర్తి నీకు తప్ప ఎవరికి విన్నవించను.....దయచూడు స్వామి......మా నాన్నగారు ని మరలా నాకు ప్రసాదించే మార్గం అనుగ్రహించు దీన బాంధవ.....
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్....
నీవే తప్ప ఇహ పరంబుఎరగ....
అన్యధా శరణం నాస్తి రక్ష రక్షో జగన్నాధ...

23, ఏప్రిల్ 2025, బుధవారం

జోల పాటలు 2

శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 
సీతామనోహరం, రఘు వీరం
వేదాంత వేద్యం,  శ్రీ ధర్మ రూపం
సీతామనోహరం, రఘువీరం
వేదాంత వేద్యం శ్రీ ధర్మ రూపం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం
హనుమంత వరదం సుగ్రీవ అభయం
ఓ సేతు బంధం దశకంఠ నిధనం
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 
సాకేత ధామం కోదండ రామం
శ్రీరామ నామం సకల కళ్యాణం 
శ్రీరామ చంద్రం శ్రీత పారిజాతం 

22, ఏప్రిల్ 2025, మంగళవారం

జోల పాటలు -1

ఎన్ని జన్మల వేచి చూతనో
ఏనాటి పూజ ఫలమో
ఏ నోము నోచెనో
ఏ పండు ఫలమిచ్చెనో
ఏ పూలు గుణమిచ్చేనో
ఏ యాగ యోగ మహిమో
ఏ పుణ్యము ఉపకరించేనో
ఏ వరము అందివచ్చేనో
నా యందు నీ కరుణ
నీ ప్రేమ అమృతంబు వర్షింప
ఈ ముకుంద నామంబున
నా ఒడిన పవళించు శ్రీకృష్ణ 
జయ మంగళ రూప జయ శ్రీకృష్ణ.

20, ఏప్రిల్ 2025, ఆదివారం

జోల పాటలు

అల్లరివాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు 
అల్లరివాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు 
ఇంటిలోని అన్నం పప్పు 
ఉట్టి మీద పాలు పెరుగు 
దేవుడింట గంట బెల్లం
పొదరింట మొగ్గ పూలు
సావిటింట ఆవుదూడ 
వెనకింట తులసి బిల్వం
తోటలోని కాయ పండు
చేనులోని నారు మొక్క
చెరువులోని చేపనీరు
ఎగిరేటి చిలుక పిచ్చుక 
తిరిగేటి కుక్క కోడి
ప్రాణమిచ్చు అమ్మమ్మ 
మురిసిపోయే తాతయ్య 
ఆటలాడు మామయ్య 
అన్నీంట వీడే అంతటా వాడే
సకలంబు వీడే గోవిందుడు
వరాన వచ్చాడు వరమివ్వ వచ్చాడు
వరహల దేవుడే కరివరదుడు 
మోక్షమివ్వ వచ్చాడు ముకుందుడు.
అల్లరి వాడే ఈ చిన్ని కృష్ణుడు 
చక్కని వాడే ఈ బుజ్జి కృష్ణుడు.

16, ఆగస్టు 2024, శుక్రవారం

బాల కనక మయ చేల- అర్ధ విశేషాలు

 బాల కనక మయ చేల - అర్ధ విశేషాలు 
ఏల నీ దయ రాదు కీర్తన అను పల్లవి





పల్లవి.---ఏల నీ దయ రాదు పరాకు చేసే వేళ సమయము గాదు  (ఏల)
అ.ప.---బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమా లోల విధృత శర
           జాల శుభద కరుణాల వాల ఘన  నీల నవ్య వనమాలికాభరణ        (ఏల)
1. చరణము.--  రారా దేవాధి దేవ  రారా మహాను భావా రారా రాజీవనేత్ర రఘు వర పుత్ర  
సార తర సుధారస పూర హృదయ పరివార జలధి గంభీర దనుజ సం
హార దశరధ కుమార బుద జన విహార సకల శృతి సార నాదుపై (ఏల)
2. రాజాధి రాజ ముని పూజిత పద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య
రాజ ధర నుత విరాజ ఉరగ సురరాజ వందిత పదాజ జనకదీన
రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజముఖ  (ఏలా)
3. యాగ రక్షణ పరమ భాగ వతార్చిత యోగీంద్ర సుహృద్భావిత ఆద్యాంత రహిత
నాగ శయన వర నాగ వరద పన్నగ  సు మధుర సదాఘ మోచన
సదాగ తిజ  ధృతి పదాగమాంత చర  రాగ రహిత శ్రీ త్యాగ రాజ నుత  (ఏలా)

ఈ కీర్తన త్యాగరాజు గారిచే కృతి పరచబడినది....
ఈ కీర్తన పల్లవి కన్నా అను పల్లవి ప్రసిద్ధి చెందినది...
ఈ కీర్తన పూర్తిగా తెలుగు పదాలతో వుండి దీర్ఘ సమాసాలు, సంధులు అలంకారాలతో వున్ననూ...
ఎంతో హృద్యంగా ప్రతి పదం... శ్రీరామ వైభవం మనకు తెలియచేస్తుంది...
అసలు పల్లవి చూడండి...
"ఏల నీ దయరాదు పరాకు చేసే వేళ సమయం  కాదు"....
ఈ కీర్తన నిర్మాణం...పల్లవి, అనుపల్లవి,3 చరణాలు కల కీర్తన...
ఇది ఆఠాన రాగం, ఆది తాళం లో స్వరపరచబడినది....
మనం నిత్య జీవితంలో కొన్ని విషయాలు సగం నుంచి గ్రహించ వలసి వస్తుంది...అతను వచ్చినాడా??? ఆమే ఏమన్నది??? ఈ అతను ,ఆమే ఎవరు అనే ప్రశ్న మనకు ఉత్పన్నమై...వారు ఎవరు అని మనం ప్రశ్నించితే మనకు దానికి సంబంధించిన వివరాలు 
లభించుతాయి...
అలాగే త్యాగరాజు గారు...పల్లవిలో "ఏల నీ దయ రాదు..పరాకు చేసే వేళ సమయం  కాదు'...ఇందులో ఒక అర్ధింపు తో కూడిన వేడుకోలు...దానితో పాటు "పరాకు చేసే వేళ  సమయం"  ఇదికాదు అనే ఓ చిన్న పాటి సూచన...
 "పరాకు" అనే పదానికి నిఘంటువు అర్ధం పరధ్యానం, ఏకాగ్రత లేకపోవటం... అయితే వాడుకలో ఈవిధంగా వుంటుంది ...  తనుచేయవలసిన కార్యం ను ఏమరుపాటున నిర్వర్తించ లేకపోవడం పరాకుగా వాడుక...
అలాగే సూచన ఏమిటంటే" వేళ సమయం  కాదు...."
సహజంగా వేళ, సమయం ఈ రెండు పదాలు కాల గమనం ...దిన ప్రమాణం కి సూచన చేస్తాం...
కాని ఇక్కడ వేళ అన్న పదం తరుణం అన్న అర్ధంలో వాడినారు...
ఇప్పుడు అసలే ఇంగ్లీష్ మీడియం .... తరుణం అంటే....
తరుణం అంటే తగు సమయం...
మనం కీర్తన పల్లవి వరకు వింటే ఈయన ఎవరిని వేడుకుంటున్నారో తెలియక చిన్నపాటి సందిగ్ధం లో వుంటే... త్యాగరాజు గారే...వారు ఎవరో మనకు వివరంగా
చక్కగా అనుపల్లవిలో వివరిస్తున్నారు....
అను పల్లవి:
"బాల కనక మయ చేల సుజన పరిపాల శ్రీరమ లోల విధృత శరజాల
శుభద కరుణాలవాల ఘన నీల నవ్య వనమాలికాభరణ " || ఏల నీదయరాదు||
ఇది అను పల్లవి....
ఇంత చక్కటి అనుపల్లవి మీరు శ్రోత గా వినగానే , త్యాగరాజు  గారు అర్ధిస్తున్న వారిపై కొంత  ఉత్సుకత, ఇంకొంత   ఉత్సాహం     మరింతగా ఆథ్యాత్మిక భావం జనించుతుంది...
ఇంతకు త్యాగరాజు వేడుకుంటున్న వారి గుణగణాలు ఆసక్తిగా ప్రారంభం...
"బాల కనక మయ చేల..."
ఇందులో బాల పదంను చాలామంది...
శ్రీరాములవారిని బాలుడిగా ఊహిస్తారు... నా అభిప్రాయం ప్రకారం అది కాదు...

ఇందులో బాల కనక పదం సీతమ్మ తల్లిని ఉద్దేశించి...
ఇందులో కనక  అనే పదం బహు కీలకం... దీనిని ఈ విధంగా అర్ధం చేసుకుంటే దీనిలో మర్మం బోధ పడుతుంది... కనక పదం రెండు పదాల మధ్య వారధి అనుకుంటాం కాదు...
బాల కనక వరకు మొదటి భావం....
కనక మయ చేల అనేది రెండోవ భావం మనం మొదటి  భావం తెలుసు కుందాము...
బాల కనక...అంటే బంగారం లాంటి స్త్రీ...
అనగా రూపమా గుణమా....
అది సీతమ్మ కాబట్టి రూపం కాదు గుణమే....
అయిననూ సర్వగుణలక్షణ శోభిత మైన స్త్రీ ని మనం ఈనాటి కి... బంగారం లాంటి స్త్రీ అని వాడుక...
అందునా సీతమ్మ వారు లక్ష్మీ అంశ...
కనక అంటే కూడా లక్ష్మీ అనే కదా మనం నిత్యం వాడుకలో అనుకునేది..
అయిననూ సీతమ్మతో  కీర్తన ప్రారంభం అంటే....
ఇదో మాతృభావన...మనం మన గృహం తలచుకోగానే ఎవరు తలంపుకి వస్తారు అంటే  ప్రధమంగా   అమ్మ..తరువాత నాన్న...
అలాగే బాల అనే పదానికి ఇంకోక విశేషం తెలుసుకుందాం..
అమ్మ వారి అనేక రూపాలలో బాల రూపం ఒకటి...
అమ్మ అంటే శక్తి, అమ్మ అంటే ఆదరణ, ఆప్యాయత, ప్రేమ ...సకలం అనుగ్రహించు దివ్యశక్తి...
అమ్మ అతి స్వల్ప మైన వాటితో కూడా అత్యద్భుతంగా సృజన చేయి శక్తి...
అమ్మ అల్ప సంతోషి...బిడ్డడి ఆనందం తన ఆనందంగా భావన చేయి ఎకైక వ్యక్తి అమ్మ మాత్రమే...
తన బిడ్డడి ఆర్తీ అమ్మకి తప్ప మరి ఎవరికి తెలుస్తుంది...
మరి ఇంతటి చల్లని తల్లితో వున్నవారు ఎలావున్నారు అంటే...కనక మయ చేల..
కనక అంటే బంగారం ...మయ అంటే నిర్మితి, నిండి వుండుట, అలదు కోవటం...చేల అనగా వస్త్రాలు....
బంగారు వస్త్రాలు ధరించి వున్నారట....
మరి ఇవి అన్నీ రాజ లాంఛనాలు సూచన చేస్తున్నాయి...మరి ఈయన ఎవరిని పాలన చేస్తున్నారు అంటే సుజన పరిపాల అంట...
సుజనులు అనగా మంచి వారు అని గ్రహించాలి...
మరి ఆయన ఎలాంటి వారు అంటే ....శ్రీరమాలోల అనే పదంతో సూచన...
శ్రీ అన్ననూ లక్ష్మీ.....  
 రమా అన్ననూ లక్ష్మీ నే....  
మామూలు అర్ధం చూస్తే లక్ష్మీ దేవికి వశ్యుడు అనే విధంగా కనపడుతుంది...  
కాని అది కాదు...  
శ్రీ అంటే స్థిరనివాసం...  
రెండోవ పదం అయిన రమ కు లక్ష్మీ అనే భావానికి సకల శుభలక్షణాలు శుభ గుణాలు అనే విధంగాను అష్టలక్ష్మీలు ఆవాసం అని   మనం భావన చేయాలి...
త్యాగరాజు గారు ప్రతి పదం ఆచి తూచి స్వరయుక్తంగా రాగయుక్తంగా వుండేలా చూసి ప్రయోగించారు...  
మనం ఉచ్ఛారణ లో కూడా అది గ్రహించాలి...  
శ్రీరమాలోల అన్న పదం మనం స్త్రీ లోల అని ఉచ్ఛారణ చేశామా పూర్తి విరుద్ధంగా వుండే అర్ధం వస్తుంది...  
ఇక్కడ త్యాగరాజు గారు అర్ధి అని మనం గుర్తించాలి....  
ఎవరైనా ఆర్ధి తనకు సహాయం కావలసి వచ్చిన, దానిని పూర్తి చేయగల శక్తిమంతుల వద్ద వేడుకుంటాడు....
.మరి త్యాగరాజు ఆర్ధిగా తన వేడుకోలు ను  ఎవరు నిర్వర్తన చేయగలరు అంటే శ్రీరమాలోల అన్నపదం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. 
మరి త్యాగరాజు కోరినది ఏమిటి అంటే కైవల్యసిద్ధి....
ఇప్పుడు  మీకు పూర్తిగా శ్రీరమాలోల అన్న పదంనకు విస్తృత  అర్ధం ఆపై      శ్రీరాములు వారు సకలశుభ సమన్వితుడుగాతో పాటు వాటిని ప్రసాదించగల వేలుపు గా    దర్శనం..
దీని తరువాత పదం ....
విధృత శరజాల.....
ధృతి అనే సంస్కృత పదానికి శౌర్యం, వీరత్వం అనే అర్ధాలు వున్నాయి...ఈ పదంకు "వి " అనే ప్రత్యయం చేరి ...విధృత అనగా విశేషమైన శౌర్యం...అసమాన పరాక్రమం...
రాజుయొక్క క్షాత్రం అతని సైనిక పాటవంలో అతని ఆయుధ నైపుణ్యం లో అతని ప్రవర్తన లో దృగ్గోచరం అవుతుంది...
రాముని యొక్క ఆయుధం...కోదండం...
దాని నుంచి శర ప్రయోగం...
ప్రయోగ శర లక్షణం సూటిగా నేరుగా 
లక్ష్య ఛేదన....
విల్లు యొక్క నారి ఎంత విస్తృతంగా సారించి లక్ష్యం వైపుగా గురి పెట్టి శర ప్రయోగం చేస్తారో అంత శక్తివంతంగా లక్ష్య ఛేదన జరుగుతుంది.
ఇది వీరత్వం యొక్క లక్షణమైతే...ప్రవర్తన కు ఈ విధంగా అన్వయించుకోవాలి....రాముని ప్రవర్తన సూటిగా స్పష్టంగా వున్నదట....
ఇప్పుడు మన పాఠకులకు ఒక సందేహం...ఇంత గొప్ప క్షాత్రం వున్న శ్రీరాముడు మన మాట...మన మొర ఆలకించుతాడా అంటే....దానికి వెంటనే త్యాగరాజు గారు ప్రయోగించిన పదం...
శుభద కరుణాలవాల....
మనకు కొన్ని సమయాలలో కొన్ని భరోసాలు కావాలి.... కోర్టు వారు మన మొర వినటం ఒక విధమైన భరోసా...
అలాగే ఆపద సమయంలో మన తాలుకా ఇబ్బంది వినే వారు మనకు భరోసా... ఇలా వినాలి అంటే వారి హృదయము ఆర్ద్రత తో నిండి వుండాలి అప్పుడే కరుణ , దయలాంటి లక్షణాలు కలిగి వుంటాయి...
మరి అందుకే శ్రీరామ చంద్రుడు శుభద
కరుణాలవాల అని త్యాగరాజు గారు తెలుపుతున్నారు...
మరి ఇంతటి మూర్తి  సాదృశ్యుడా లేక అదృశ్యుడా లేక మార్పు చెందుతాడా అంటే....
తరువాత పదం "ఘన నీల"
రెండు భిన్నమైన పద ప్రయోగాలతో 
విలక్షణమైన అర్ధ సౌందర్యం...
ఘన అన్న పదానికి గొప్పదైన, స్థిరమైన, కీర్తీవంతమైన అన్న అర్ధాలు వున్నవి... 
అలాగే నీల అనే పదానికి నీలం, గరళం, జలం లాంటీ అర్ధాలు వున్ననూ ప్రస్తుతం మనం నీల వర్ణం అన్న విషయం తెలుసుకుందాం..... అలాగే శ్రీరామ విషయంలో ఘన అనే పదానికి అనేకానేక విశేషణాలు వున్నవి.... శ్రీరామ చంద్రుడు వంశ పూర్వీకులు రఘవంశీకులు గా ప్రసిద్ది.... అలాగే శ్రీరామ నిర్ణయం, వాక్కు స్థిరము....
నీల అనగా శ్రీరాముల వారిని మేఘ శ్యామ అనే విధంగా పోల్చుతారు...
మేఘం ఆకాశం లో వుండి మనకు నీల వర్ణంగా కనపడుతుంది...
ఆకాశం అనేది సర్వ ప్రాణికోటికి అవకాశం ఇస్తుంది... అలాగే జీవకోటి మనుగడకు ముఖ్యమైన జలం ప్రసాదిస్తుంది...
కనుక సకల ప్రాణికోటికి శ్రీరాముల వారు ఆకాశ సదృశ్యులు....
దీని తరువాత పదం...
నవ్య వనమాలికభరణ....
వివిధ మైన అందమైన పూలమాల ధరించిన....
ఇది అనుపల్లవి వరకు విశేషార్ధం....
పూర్తి చరణాలకి అర్ధ విశేషాలు తెలుపుదామని వున్ననూ సమయ భావం వలన అవకాశం లేదు...
అయిననూ శ్రీరామ కరుణ, ఆజ్ఞ అయితే మహాప్రసాదం....
అంత వరకూ కొంత విరామం...
సర్వులకు సకలం శ్రీరామ జయం....
ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, విమర్శలు , సందేహాలుకి...
ఆలపాటి రమేష్ బాబు..
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో 
విజయవాడ 
9440172262.

4, ఆగస్టు 2024, ఆదివారం

శ్రీ కృష్ణాష్టకం విశేషార్ధం


 

శ్రీ కృష్ణాష్టకం - విశేషార్ధం


 వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
*************************************
ఈ కృష్ణాష్టకం ను భారతదేశ వ్యాప్తంగా వారి వారి భాషల్లో వారి వారి ప్రాంత ఆచార వ్యవహార రీతులకు అణుగుణంగా అర్చన, పూజ,జప, సాధన, హోమ,తర్పణ సమయాల్లో ఉపయోగిస్తారు.....
ఈ అష్టకం శంకరాచార్యులు అని దీనిలో ప్రస్తావన చేసిననూ..‌.
ఇది తదనంతర కాలంలో ఎవరో అజ్ఞాత గురుపరంపరలో వారు సృజన చేశారు అని నా అభిప్రాయం .
ఏది ఏమైనా ఈ అష్టకం విశిష్ట స్థానం ఉన్నది అన్నది నిర్వివాదాంశం.
ఇంకా ఈ అష్టకం అర్ధ విశేషాలు కి వద్దాం....
నేను ఈ అర్ధ విశేషాలు పేరుతో వివరణకు కారణం క్లుప్తంగా...
హైందవ సాహిత్యం, పూజ రీతుల్లో ఉపయోగించే భాష సంస్కృతం. కాని నేడు అది వాడుక భాష కాదు అధ్యయన భాష కాదు. ఇది పాక్షికంగా అధ్యనం నిమిత్తం వినియోగం....
దీనితో ఇది కంఠస్థం చేసి వల్లే వేయటం తప్ప ఇందులోని అర్ధం పరమార్ధం ఏమిటో ఎందుకు చెప్పినారో అన్నది మరుగున పడిపోతున్నాయి....
వాటి అర్ధ విశిష్టత తో పాటు దేవి, దేవతలు రూపం, లక్షణ, గుణ , వైభవ లాంటి విశేషాలు తెలిసిన...ఆయా దేవతలను ఇంకా శ్రద్ధగా కొలుస్తారు అనే ఒక ఆశ....
ఇంకా అష్టకం పేరుతో అన్నీ దేవి దేవతా రూపాలకు అష్టక సాహిత్యం వున్నవి...ఇవి అన్ని వివిధ విధాలుగా వున్నవి....
అష్టకం అనగా 8 శ్లోకాలలో ఆయా దేవి దేవతలను ప్రస్తుతించటమే....
అష్టకంలో సాధారణంగా మకుటం కలిగి వుంటుంది...అష్టక స్తోత్రాలకు, పురాణసాహిత్యంకి వైదిక సాహిత్యం లాగా స్వర పద్ధతి...మాత్ర, ఛందస్సు లాంటి పట్టింపులు వుండవు... అలాగే ప్రాంతీయ పదాలు, ప్రాంతీయ పలుకుబడితో దేవతలను ప్రస్తుతించుతారు...అదియిను గాక ఇవి నిత్య దైనందిన కార్యక్రమాలు చేస్తూ భగవధ్యానానికి అనువుగా వుంటాయి...తినగ తినగా వేము తియ్యగుండు...అనగ అనగా రాగమతిశయించు అని వాడుక...అలాగే దేవి దేవతల నామ స్మరణం వలన మనకు అప్రయత్న పుణ్యం, దేవి దేవతల సాన్నిహిత్యం లభిస్తుంది... అలాగే...అష్టమ సంఖ్య ఒక నిగూఢ సంఖ్య.....ఇది మన అజ్ఞాత పుణ్య పాప భవిష్యత్తు సూచన చేస్తుంది....అనగా జీవన సమరంలో దుఃఖ హేతువు అయిన స్థితి నుంచి మంచి భవిష్యత్తు వైపుకి ప్రయాణం అన్న సూచన...ఈ అష్టక పఠనం లో
 దాగి వున్నది.
అందుకే కాబోలు కృష్ణుడు అష్టమ గర్భంలో జన్మంచినారు....
ఇంకా కృష్ణాష్టక విషయానికి వస్తే....
ఈ అష్టక మకుటం...కృష్ణం వందే జగద్గురుమ్....
గురువు అనగా బోధ చేసేవాడు.... 
అజ్ఞాన తిమిరం తొలగించి వెలుగు వైపు ప్రయాణం చేయించు వాడు... 
అలాగే మన జీవన పధం ఇది అని నిర్దేశన చేయివాడు...
మరి కృష్ణుడు భగవద్గీత ప్రభోదం వలన
జగత్ గురువు  అయినాడు....
ఈ అష్టకంలో శ్లోకానికి  రెండు చరణాలు. ఇందులోనే ద్వీతియ చరణం ఆఖరున మకుటం కలిగి వుంటాయి.
ఈ అష్టకం కొన్ని నిగూఢ, మార్మిక శబ్దాలు తో పాటు ఒక విషయానికి భిన్నమైన మరోకటి ప్రతిపాదన చేస్తున్న విధంగా వున్ననూ...అవి శ్రీ కృష్ణుని నిగూఢ చర్యలను ఆయన జీవన విశేషాలను ఆయన రూప వైభవాలను మనకు తెలియచెప్పుతాయి....

మొదటి శ్లోకం :
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఈ చరణం లో  శ్రీకృష్ణుడు వసుదేవుని
కుమారుడుగాను మరియి ఆయన అవతార లక్ష్యం చెప్పినారు...‌
శ్రీకృష్ణుడు వసుదేవుని కుమారుడు , ఆయన కంసుడు, చాణూరుడు అనే రాక్షస ప్రవృత్తి కలిగిన వారిని సంహరించారు అని మొదటి చరణ మొదటి పాదం అర్ధం.
ద్వీతియ చరణం చూడండి.... దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురుం....
ఇది మనకు  సాధారణ చరణంలా కనపడిననూ కొంత విస్తృత అర్ధం కలిగి వున్నది....
దేవకి దేవి గర్భవాసంన శ్రీకృష్ణుడు జన్మించాడు అన్నది మనకు ఎరుక.
 సాధారణంగా తల్లి కొరుకునేది తన బిడ్డ మనుగడ....ఆమే సోదరుడు,ఆమేను భర్తతో సహా ఖైదు చేసి ఆమేకు జన్మించిన 7గురు శిశువులను హత్య చేశాడు...కాని అష్టమ గర్భం అయిన శ్రీకృష్ణుడు తన దైవ అంశతో, దైవమాయ వలన రక్షించ బడినాడు...ఇది ఆనందకరమైన విషయం.... పరమానందం అంటే...ఇంతకు మించి సంతోషం లేదు అనేది పరమానందం. తన బిడ్డ ప్రయోజకుడు అయి తన సంసార భాధ్యత పంచుకుంటే...తన తల్లి కష్టాన్ని , ఇబ్బంది ని తొలగించితే ఆ తల్లి సంతోషం ఆనందం మనకు పరిచయం...మరి దేవికి కూడా సాధారణ మాతృ లక్షణం కలిగి వున్నది....ఆమే తీరని దుఃఖం పుట్టింట సోదరుని పాలనలోని చెరసాలలో వున్నది....తను తన భర్త చెరసాల జీవనం ఆమేకు తీరని దుఃఖం.
సాధారణంగా స్త్రీలు అత్తారింట ఆదరణ కోరుకుంటారు.... కొంతమంది కి నిరాదరణకు గురి అయిననూ ఓపికగా వుండి జీవితం సుఖమయం చేసుకుంటారు...కాని పుట్టింటి నిరాదరణ అనేది వేదన దుఃఖం భరితం.అంతటి వేదనను కంసుని పరిమార్చటం ద్వారా  దేవికి దేవికి పరమానందం కలిగించాడు...
రెండోవ శ్లోకం..
ఆతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీ కృష్ణుడు అవిశ పువ్వు లాగా వున్నాడట....హారాలు, కాళ్ళకు కడియాలు లాంటివి కలిగి వున్నాయట.
చేతులకు రత్న కంకణాలు కలిగి వున్నాడట...
అవిశ పువ్వు నీలం రంగులో వుండి... గుండ్రంగా వృత్తాకృతిలో ఐదు రేకలు కలిగి వుంటుంది...
మూడవ శ్లోకం
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
ఒంపులు తిరిగిన కేశాలతో అనగా గిరజాల శిరోజాలు అనగా రింగులు జుత్తుతో వున్నాడట....ఇంకా ఎలా వున్నాడు అంటే పూర్ణ చంద్రుడు లాగా వున్నాడట... సాధారణంగా చంద్రునికి 16 కళలు వుంటాయి అవి రెండు విధాలుగా గణన...‌మొదటి విధానం పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మరియి అమావాస్య  వరకు వున్న చంద్రబింబం కళలను ఒక విధంగా  మరి రెండోవ విధం శుక్లపక్ష అష్టమి నుంచి బహూశా పక్ష అష్టమి వరకు మధ్య వున్న చంద్ర దర్శనం రూపాలను షోడశ చంద్ర కళలు గా అభివర్ణిస్తారు ..కాని పౌర్ణమి నాటి తిధి వ్యాప్తిలో  మధ్య భాగంలో పూర్ణచంద్ర దర్శనం ఆ సమయంలో చంద్రుని బింబ దర్శనం పూర్తిగా గుండ్రంగా గోళాకృతి లో దర్శనం ఇస్తుంది...స్వామి వారు అలాగే వున్నారట...స్వామి వారి చెవులకు కుండలాలు ధరించి వున్నారు...కుండలం అంటే కర్ణాభరణం అని అర్ధం.... కాని విలసత్ అనే విశేషణం ద్వారా దానికి ఒక దివ్యత్వం కల్పించారు....
4 వ శ్లోకం:
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
మందారపూల పరిమళంతో , నాలుగు చేతులతో వున్నాడట....మనకు శ్రీ కృష్ణ రూపం రెండు చేతులుగానే పరిచయం...కాని ఇక్కడ మనకు నాలుగు చేతులు అని చెపుతున్నారు అంటే శ్రీ కృష్ణుడు ఒక అలౌకిక దేవతాంశ అని... సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని వైకుంఠ వారసుడిని మన హృదయానికి పరిచయం చేయటం....
తలపై నెమలి పింఛం....
బర్హీపింఛం అంటే ఆనందంతో పురి విప్పిన నెమలి పింఛం గా మనం అర్ధం చేసుకోవాలి....అనగా తనను ఆశ్రయం పొందిన వారికి తన నామ జపం తో ఆనందం లభించును అని మనకు తెలియచేయటం.
సాధారణంగా మనం ఆనందం అంటే ఐహిక పరిభాషలో ఒక విధంగా ఆధ్యాత్మిక పరి భాషలో వేరుగా వుంటుంది....మనస్సు సంతులనతో (balance) స్థిరం గా వుంటుంది....అని గ్రహించండి...
5వ శ్లోకం...
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
స్వామి వారు అరవిచ్చిన పద్మాలు వంటి కన్నులతో వున్నారట....దేవతాంశల కన్నులను పద్మాలతో పోల్చడానికి కారణం....పద్మం బురదలో పుట్టినను నిర్మలంగా ప్రకాశ వంతంగా వుంటుంది... అలాగే మానవుడు కూడా తన చుట్టుపక్కల అనేక విధాల ప్రపంచం, పరిస్థితి వున్ననూ మీ దృష్టి దేవునిపై లగ్నం చేయండి అని భావన..
అలాగే స్వామివారు నీలి  మేఘశ్యాములుగా వున్నారట...
జీమూతము అనగా మేఘం...
నీలి మేఘం శ్యాముడంటే...
వర్షించటానికి సిద్ధంగా వున్న మేఘం...
తగిన వాతావరణం పరిస్థితి రాగానే వర్షిస్తుంది.
మేఘం యొక్క వర్షం వల్లనే ప్రకృతి తన యొక్క ఆర్తిని చల్లార్చి భూమి పంటల రూపంలో మానవాళిని నిలబెడుతుంది....
మరి స్వామి వారు ఏమి వర్షిస్తారు అంటే...ఈ స్వామి ఆర్ద్రత కలిగిన వాడు సదా... ప్రేమ, కరుణ ,దయ ,ముక్తి ప్రసాదించ గలడు మీరు భక్తి శ్రద్ధలతో కొలవండి ...మీ జీవితాన్నీ అమృతమయం చేసుకోండి.( మీకు ఆసక్తి,  వీలుంటే జీమూతవాహనుడు కధ తెలుసుకోండి)...
ద్వితీయ చరణ  అర్ధం...
యాదవ కులంలో అగ్రగణ్యుడు అని అర్ధం 
యాదవ కులంలో అంటే ఈనాటి నిత్యం పరిభాషలో కులంగా వర్గీకరిద్దామా...కాదు యాదవ కులం ముఖ్య వృత్తి గోపాలనం....గోవు యొక్క సాధుత్వం మరియి దాని విశిష్టత ప్రత్యేకంగా తెలుపవలసిన పనిలేదు....సాధుజన రక్షకులు ఎవరు తమ వృత్తి గా ప్రవృత్తి గా వుంటారో వారు యాదవ వంశం వారుగా మనం అర్ధం చేసుకోవాలి....
6వ శ్లోకం 
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీకృష్ణుడు పసుపు వర్ణం కలిగిన వస్త్రాలు ధరించి రుక్మిణీ దేవితో ఆనందంగా ప్రకాశవంతంగా  వున్నాడు అని అర్ధం.
ఇక్కడ " కేళి " అనే మాటకు కొంత విశేషం వున్నది... సాధారణంగా స్త్రీపురుష సమాగమంను సంగమంగా వర్ణిస్తే....దైవాంశ స్త్రీ పురుష సాన్నిహిత్యంను " కేళి" గా వర్ణించారు.
కేళి అనే పదంనకు ఆట, సైయ్యాట, ఆనందోత్సాహాలు అనే క్రియారూపకార్ధాలు కూడా మనం ఇక్కడ గురుతు చేసుకోవాలి.
శ్రీకృష్ణునకు అష్టభార్యలు వున్ననూ రుక్మిణీదేవి సాక్షాత్  లక్ష్మీ అంశ మరియి పట్టమహిషి ఇంతేనా
అంతేకాదు ఆమే చిన్న తనం నుంచి శ్రీకృష్ణుని తన ఉచ్ఛాస్వ నిశ్వాస్వలందు శ్రీకృష్ణనామ రూపాలను తనయందు నింపుకుని వున్న స్త్రీమూర్తీ. శ్రీకృష్ణునే భర్తగా పొందాలని తపించి వరించి పొందిన వనిత.
అందుకే ఆమే పట్ట మహిషి.... భగవంతుడు ఎప్పుడూ భక్త హృదయుడే అని మనం అర్ధం చేసుకోవాలి....
ఇంకా శ్లోకంలో రెండోవ చరణం కూడా ఇంకో స్త్రీ మూర్తి ప్రస్తావన.....
రెండోవ చరణం అర్ధం... శ్రీకృష్ణుడు తులసి పరిమళాలతో నిండి వున్నాడు అని అర్ధం....
శ్రీకృష్ణుడు నారాయణ అంశగాను....తులసి ప్రియుడు గాను మనకు తెలుసు....తులసి కధ , తులసి వరం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి....
7 శ్లోకం....
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికలతో కూడిన శ్రీకృష్ణ వక్షసమ్ కుంకుమతో ప్రకాశం గా వున్నది....ఇది సాధారణ అర్థం....మనం మరికొంత విస్తృత పరిధిలో వివరణకు ప్రయత్నం చేద్దాం...
శ్రీకృష్ణుడు, బృందావనం,గోపికలు, రాసలీలలు ఇవి శ్రీకృష్ణ ప్రేమతత్వం లో ప్రతి ఒక్కరు తమకు తెలుసునని భావించే విషయాలు. అలాగే ఎంత మధించినా శోధించినా అంతు చిక్కని విషయం...వారి వారి బుద్ధి, జ్ఞాన, ప్రాప్తి లను అనుసరించి వారికి అనుభవంలోకి వచ్చే విషయం...కనుక ఈ చరణార్ధం మరికొంత వున్ననూ పాఠకులకుగల శ్రీకృష్ణకృప వలన మరికొంత బోధ పడుతుంది.
ఆథ్యాత్మిక స్తోత్రము లో కుచద్వంద అనే ప్రయోగం..అందులోను గోపికానం కుచద్వందం ...ఈ ప్రయోగంతో ఆదిశంకరుల వారు తమదైన చమత్కారం చూపారు...
గోపికలు వీరు ఎవరు అనే ప్రశ్న???
వ్రజ నివా‌సులైన గోపాలుర స్త్రీలు గోపికలు. వీరికి శ్రీకృష్ణునితో కల సాన్నిహిత్యం అనుబంధం , ఓ అలౌకిక ఆథ్యాత్మిక ప్రయాణం.
గోవులు,గోపాలురు,గోపికలు ఈత్రయం సాధించిన అద్భుతం ఏమిటి అంటే... కొన్నీ కోట్ల నామ జపం, తపం, హోమం,దానం,ధర్మం లాంటి
ఇత్యాది క్రతువులు చేసీ సాధించలేని...
భగవానుని ప్రియత్వం, సఖత్వం, ప్రియసఖత్వం తమ నిర్మలమైన 
ప్రేమ ద్వారా సాధించారు. గోపికలు అయితే వర్ణించనలవి కాని ప్రేమ...
గోకులంలో శ్రీకృష్ణుడు యశోదా తనయుడే కాని శ్రీకృష్ణ లీలా వైభవం వలన గోకులంలోని ప్రతి గోపిక స్త్రీ ,బాల, కన్య, వృద్ధులు అందరూ తమ వాడిలాగానే భావన చేశేవారు.... కొంతమంది స్త్రీలు అయితే శ్రీ కృష్ణుడు దర్శన సమయంలో తమలోని వాత్సల్యం వలన మాతృత్వ భావన ఉప్పొంగి తమ స్థనద్వయం చేపుకొని పాలతో నిండగా శ్రీ కృష్ణునికి పాలు త్రాపి...తమ జన్మ ధన్యం మైనదని తరించామని భావన చేశే వారు..
. మరికొంత మంది బాల,కన్యలు శ్రీకృష్ణుని పై గల అనితర ప్రేమ అనురాగాలు వలన శ్రీ క్రిష్ణుడు తమ స్నేహసఖుడని భావన చేసేవారు.
గోపికలలో కల ద్వంద భావన యే కుచద్వంద ప్రయోగం గా భావించవచ్చు...రెండోవ పద్ధతి చేరువైన గోపికలతో రాసలీలలో కృష్ణుని వక్షస్థలం కి కుంకుమ అలదుకోవటం వలన కృష్ణ వక్షస్థలం కుంకుమతో శోభాయమానంగా వున్నది....
రెండోవ చరణం: శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం....
శ్రీనికేతం.....ఇది రెండు పదాల సంయుక్తం.
 శ్రీ అనగా లక్ష్మీ, శుభాలు అన్న వరకు ప్రస్తుతం మనం ప్రస్తావన చేసుకుందాం. నికేతం అనగా కలిగి వుండుట, స్థిరనివాసం,పద్మం, విష్ణు నివాసం అనే అర్ధాలు వున్నాయి...అనగా కృష్ణుడు శ్రీమన్నారయణాంశ అని వీరిని ఆశ్రయం పొందిన వారికి సకల శుభాలు పొందగలరని మనం తెలుసుకోవాలి....
ఇంకా మహేష్వాసం అనునది శివుడు కృష్ణునకు ప్రసాదించిన ధనుస్సు పేరు...
మనకు స్తోత్ర సాహిత్యం లో ఒక్క పదం చాలు దాని వివరణ ఇవ్వటానికి పది పేజిలు చాలదు....ఇది శంకరుల వారు అంతటి గొప్ప పదాలతో స్తోత్రం నిర్మాణం చేశారు. శివుడు కాలరూపుడు గా భావన చేయాలి.అందుకే శివాలయ ప్రదక్షణలు శివాభిషేకం అన్నది నిత్యజీవితంలో కాలప్రభావ తీవ్రత యొక్క తాపశమనం గురించి పండితులు మనకు చెపుతారు.
కృష్ణునకు శివుడు విల్లు ఇవ్వటం అంటే....మనకు భాగవతంలో కాని మిగిలిన సాహిత్యంలో కాని కృష్ణుని యుద్ధాల ప్రస్తావన కన్ననూ మిగిలిన ధర్మాధర్మచరణ తో మిగిలిన విషయాల ప్రస్తావన ఎక్కువగా వున్నది.అలాగని కృష్ణుడు కొన్ని యుద్ధాలు చేసిననూ అవి మనకు ప్రస్తుతం అవసరం లేదు.
ఇంకా ధనస్సు లక్షణం ఏమిటి... లక్ష్యం వద్దకు శరంను వేగంగా పంపటం....అనగా లక్ష్యనిర్దేశం చేయటం...మహభారత యుద్ధరంగంలో భీరువైన అర్జునకు శ్రీకృష్ణుడు గీతరూపకంగా లక్ష్యనిర్దేశం చేసినాడు. మనం మన నిత్యజీవితంలో అనేకానేక సమస్యలతో సతమవుతుంటాం వాటి నివారణోపాయం...శ్రీకృష్ణ నామ ఆశ్రయం....కృష్ణ కృష్ణ అని పలుకుతూ మీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వహించండి మీకు జయం.
అందుకే మన పూర్వులు చిన్న దానం చేసిన ధర్మం చేసినా కృష్ణార్పణం భగవతార్పణం అనే మాట పలికేవారు...
అందుకే  భగవద్గీత లో సంజయుడు ద్వారా ఆఖరి శ్లోకం ప్రస్తావన చేస్తారు...
అది...
"యత్ర యోగేశ్వర: కృష్ణ: యత్ర పార్థో ధనుర్ధర:|తత్ర శ్రీర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ||"
(శ్రీమత్‌ భగవద్గీత అధ్యాయం: 18 శ్లోకం: 78 )
తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్య ము, వాటితో పాటు ధర్మము, నీతి, దృఢంగా, స్థిరం గా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయు డు ధృతరాష్ట్రునితో చెప్పాడు.
ఈ శ్లోకంలోని యత్ర,తత్ర పదాలుద్వార మనకు సమయం కూడా నిర్దేశన అనగా సకల కార్య సర్వావస్థలయందు అని మనం అర్ధం చేసుకోవాలి.
అనగా శ్రీకృష్ణ నామం సదా జయప్రదం ఫలప్రదం అని మనం అర్ధం  చేసుకోవాలి.
8వ శ్లోకం.
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఈ శ్లోకం కి నేరుగా విస్తృత అర్ధం తెలుసుకుందాం....
శ్రీవత్సం అనేది విష్ణువు యొక్క హృదయం పైన వున్న మణి పేరు.
శ్రీవత్సాంకం అనేది శ్రీ+ వత్స+అంకం అనే మూడుపదాల సంయుక్త పదం.
శ్రీ అనగా లక్ష్మీ...
వత్సము అనగా లేగదూడ, వాత్సల్యం,శిశువు
అనే అర్ధాలు వున్నవి....
అంకం అనగా ఒడి....
సకల జగత్తు కి లక్ష్మీనారాయణులు తల్లితండ్రులుగా మనకు తెలుసు....
తండ్రి పాలన అయితే తల్లి లాలన పోషణ....తల్లి ఒడిలో వున్న శిశువుకు నిశ్ఛంత, భద్రత ఇంతకన్నా మంచి ప్రదేశం సృష్టి లోనే లేదు...మాతృ వాత్సల్యం అన్నది భాషకు భావానికి అందని ఒక లక్షణం...
తల్లి వద్ద పిల్లవానికి ప్రాయంతో నిమిత్తం లేదు అన్నీ అవసరాలు అనగాఆహార, ధన,కనక, వస్తు,మనో ధైర్యాలు శిశువుకు లభిస్తాయి...
కొన్ని సమయాలలో తండ్రి ఏ సదుపాయం అయిననూ కల్పించ నిరాకరించిన.... తండ్రిని ఒప్పించి నప్పించి సాధించగల ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే....ఇది నిత్యం మనం గృహాలలో కూడా మనం అనుభవిస్తున్నది చూస్తున్నది జరుగుతున్నదే....
అనగా శ్రీకృష్ణ ఆశ్రయం తో మనం
నిశ్చంతగా నిర్భయంగా వుండవచ్చు...
అది ఎలా అంటే మహోరస్కంగా అంటే
మంచి వెలుగుతో అని అర్ధం....
అదియినూ క్రిష్ణుడు ఎలా వున్నాడు అంటే
వనమాల విరాజితమ్....అనగా....పూల దండలు ధరించి
వున్నాడట.
శంఖ, చక్రం ధరించిన శ్రీమన్నారాయణ స్వరూపం అయి సకల జగత్తుకు గురువు అయిన శ్రీకృష్ణునకు నమస్కారం.....
ఇది కృష్ణాష్టక విశేషార్ధం....
నాకు టీకా తాత్పర్య అనువాదం తెలపటం అంత ఇష్టం వుండదు...
అంతరార్ధం, విశేషార్ధంగా నాదైన వ్యాఖ్య తెలిపినప్పుడే సంతృప్తి.
ఈ విశేష వ్యాఖ్య వ్రాయటానికి కొంత సమయం పడుతుంది...
అంతకాలం స్వామి తోనే ప్రయాణం....
 స్వామి గురించి స్వామి వారే చెప్పాలి...
కాకపోతే ఇప్పుడు స్వామివారు మాఇంట్లో దౌహిత్రుడుగా శిశువుగా చిరంజీవి జీవాన్ష్ ముకుంద్ గా ...ఉదయించి అతని ముద్దు ముచ్చట్లు తో ప్రేరణ కలిగిస్తున్నాడు...
కనుక ఈ క్రేడిట్ మా మనుమడు ముకుంద్ దే...
ఈ తాత ముకుంద్ కు ఇస్తున్న చిరుకానుక...అందరూ ధన కనకాల పట్ల ప్రీతి చూపుతున్నారు...కాని ఈ తాతకు అక్షర లక్షల పట్ల ప్రీతి....
స్వామి వారు మా మనుమడి కి సకలం సర్వం ప్రసాదించాలని స్వామి వారి పాద పద్మాలను వేడుకుంటూ....
శ్రీరామ జయం....
ఈ వ్యాసం పై మీకు వివరణ కావలసిననూ లేక సందేహ నివృత్తి....
లేక విమర్శ అయిననూ...
ఆలపాటి రమేష్ బాబు....
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో 
11-44-29A కుమ్మరి వీధి..
విజయవాడ...
9440172262.

















17, నవంబర్ 2023, శుక్రవారం

మెరుగు చెంగట యున్న మేఘంబు అర్ధ విశేషాలు

మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి

నువిద చెంగటనుండ నొప్పువాఁడు,

చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు,

వల్లీయుతతమాల వసుమతీజముభంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు,

నీలనగాగ్ర సన్నిహితభానునిభంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు,

పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు,

వెడఁదయురమువాఁడు, విపులభద్ర మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁ డదె కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.’

++++

పలికెడిది భాగవతమఁట,పలికించెడివాఁడు రామభద్రుండఁట, నేఁబలికిన భవహర మగునఁట,పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేలా!

ఈ రెండు పద్యాలు పోతన భాగవతం లోని....ప్రధమ స్కంధం లోనివే.

పోతన భాగవతం...రచనా నేపథ్యం, రచన వ్యాసాంగ ప్రారంభంనకు గల కారణాలు తన రచనలోని పొందుపరిచారు.

కారణం పోతన గారి కన్నా ముందు పోతన భాగవతం ఆంధ్రీకరించే సాహసం ఎవ్వరూ తీసుకోలేదని చరిత్ర తెలియ చేస్తున్నది....అందులోను ఆనాటి రచనా వ్యవస్థ రాజాశ్రయం లోనే వుండేవి....

నన్నయ్య గారు ఆదికవి గా మన్నన పొందినను వారు కూడా రాజాశ్రీతులే నన్నయ్య గారు రాజరాజనరేంద్రుడు ఆస్థాన కవి అని జగమేరిగిన సత్యం...అంత వరకూ ఎందుకు పోతన గారి సమకాలికుడు స్వయంగా బంధువు అయిన శ్రీనాథుడు రెడ్డిరాజుల ప్రాపకం..కాని పోతన గారు తన భాగవత రచన శ్రీరాముని కే అంకితం అన్నాడు...

ఇలా చాలా చాలా మధన పడినారు..

ఒక ఆదివారం గోదావరి నది స్నానం చేసినారు... ఆరోజు సోమోపరాగం...మీరు ఏమిటో అని భావన చేయవద్దు చంద్రగ్రహణం ని ఆవిధంగా పిలుస్తారు...

గ్రహణం విడిచిన తరువాత... స్నానానంతరం పోతన తన ఇష్ట దేవత ఆరాధన మరియి మంత్ర పఠనం, పునఃశ్చరణలో వుంటే శ్రీరామ చంద్రుడు దర్శనం ఇచ్చారు...

ఆ పద్యము " మెరుగు చెంగట" అనే సీస పద్యం లో వివరించారు.

సీస పద్య లక్షణం ప్రకారం మొదటి నాలుగు పాదాలు సీస ఛందస్సు లోను తదనంతరం అనుసరణ పద్యం వీరు కందపద్యం గా రచన చేశారు .

పోతన గారి రచనలో ఎక్కువ భాగం ఆటవెలది, కందపద్యం కారణం ఇవి జన బాహుళ్యానికి దగ్గరగా వుంటాయి...సాధారణ ఛందస్సు లో తేలికగా వుంటాయి చాలా పద్యాలు ప్రజలు సులభంగా ముఖతా ధారణ కలిగి వుంటారు..ఇందుకు ఉదాహరణ "చేతులారంగ శివుని పూజింపడేని", "అందు కలడని, ఇందు కలడని సందేహం వలదు " లాంటివి మనం గమనించవచ్చు.

పోతన గారి వివరణ భలే గమ్మత్తుగా

భలే ఆసక్తిగా అలా అని సత్యదూరం గా వుండదు మన అనుభవం లో వుండే విధంగా వుంటుంది... అందుకే...పాఠకుడు ముందు దృశ్యం సాక్షాత్కరిస్తుంది...దీనితో పాఠకుడు తనదైన కల్పనా శక్తి అనుకోండి భక్తి ప్రపత్తులతో అనుకోండి ఎలాగైనను ఆ ఘట్టం లో తాను అక్కడే వుండి ఆ దృశ్యం స్వయంగా చూస్తున్నారు అనే అనుభూతి కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు....

ఇక అర్ధం వివరించే ప్రయత్నం చేస్తాను..

"మెరుపుతో కూడిన మేఘఛాయతో వుండి ఒక స్త్రీ తో కూడిన వాడు"

ఇది మొదటి పాదం అర్ధం...

మనకు ఆకాశంలో మేఘం కనపడటం వేరు మెరుపుతో కూడిన మేఘం ప్రకాశవంతంగా మనస్సుకు హత్తుకునేలా మరోసారి చూడాలి అనే విధంగా వుంటుంది...

కాని కొద్దిగా ఈ అర్ధం మార్చి చూడండి...

సీతమ్మ వారు మెరుపు వంటి మేని ఛాయ తో స్వామి వారు మేఘఛాయతో....అయ్యవారి ప్రక్కనే అమ్మవారు వుంటారు కదా...

మానవులు సహజంగా మాతృస్తన్యం మాతృగర్భ వాసన వీడలేరు వీడకూడదు వీడరాదు. ఇది పోతన గారిలో కూడా అందుకే అమ్మవారితో కూడిన అయ్యవారు అనే విధంగా...

తరువాత పాదం..

'చంద్రమండల సుధా సారంబు '

చంద్రుడు మనః కారకుడు...మానవుల చిత్త ప్రవృత్తులపై ప్రభావం చూపువాడు...అందుకే చంద్రుని వెన్నెల శీతలం గా హాయి కొలుపు విధంగా వుంటుంది...ఇవి మన స్వయానుభవాలే. అందులోను పౌర్ణమి నాడు పూర్ణ చంద్రుడు ఎంత మనోహరంగా ఎంత ఆహ్లాదంగా వుంటారో మనకు ఎరుక....సహజంగానే మనం రాముల వారిని రామచంద్రుడు అని అంటాం...అటువంటి రాముల వారు పూర్ణ చంద్రుని వెలుగు

అంతటి అమృతం జాలు వారునట్టి చిరునవ్వుతో స్వామి వారు వున్నారంట....

తరువాత పాదం...

"వల్లీయుతతమాల వసుమతీజం భంగి"

తీగలతో కూడిన తమాల వృక్షం లాగా ఎత్తుగా వున్న రాముల వారి భుజం పైన విల్లు ఆయన ఆయుధం ధరించిన విధంగా కాదు అంటూ అది అతి సహజంగా భూమి నుంచి ఉద్భవించిన లత లాగా శోభనిస్తున్నాయి అట.

అంటే అతి సహజంగా విల్లు అనేది రామునిలో భాగంగా మనకు ఉదహరిస్తున్నారు...విల్లుతో కూడిన రాముడు అంటే అర్ధం...ధర్మపరిపాలన కోసం అని.... దుష్టశిక్షణ శిష్టరక్షణ తన అవతార ఉద్దేశ్యం అని మనం తెలుసుకోవాలి... కావాలంటే గమనించండి దశావతారాలు అన్నీ మనం దర్శించిన ఆయా ఆవతార ఉద్దేశ్యం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.

తరువాత పాదం...

" నీలనగాగ్ర సన్నిహిత భానుని"

శ్రీరాములు వారు ఆజానుబాహుడు...అందులోను వారు నీల మేఘ శ్యాములు వారి శిరస్సు పై కిరీటం సూర్యునిలా ప్రకాశిస్తూ వున్నది

ఇంత వరకు సీస పద్యం... తదనంతరం అనుసరణ పద్యం.

"పుండరీక యుగం బోలు కన్నుల వాడు"

పుండరీకం అనే పదానికి విశేష అర్ధాలు చాలా వున్ననూ ఇచ్చట తెల్ల తామర అనే అర్ధం లో ప్రయోగించారు.

తెల్లని కనుదోయి ప్రకాశవంతంగా నిర్మలంగా వున్నాయి.

సాధారణంగా కవులు దేవతా, స్త్రీ వర్ణనలో కన్నులను పద్మాలతో పోలిక చేస్తారు. కారణం ఇవి సున్నితంగా, లాలిత్యం తో మనోహరంగా ఆకర్షణ తో పాటు వాటి జనన ప్రదేశం ఎంత దుర్భరంగా వున్ననూ పద్మాల సహజ లక్షణమైన నిర్మలత్వం వెలువరిస్తాయి.

అంతే కాదు ఇక్కడ పుండరీకం అనే పదం ఉపయోగం ఇంకొకటి వున్నది.

అది భక్త సులభుడు అనే కోణంలో.

మనం గోవింద నామాలలో పుండరీక వరద గోవింద అంటాం.

తరువాత పాదం...

"వెడద యురము వాడు, విపుల భద్ర

మూర్తి వాడు..."

విశాలమైన వక్ష స్ధలంతో నమ్మదగిన వాడుగా అని అర్ధం...

విశాలమైన వక్షం అనేది దేహ పరిణామం తో చూడాలా కాదు...

ఆపన్నులను కాపాడాటంలో ముందు నుండే వాడు, దయార్ద్ర హృదయం కలవాడు, వీరత్వం కలిగిన వాడు , మిత్రులను, కష్టాల్లో వున్నవారు,ఆత్మీయులను అనురాగం తో అక్కున చేర్చుకుని హత్తుకునే వాడు లాంటి అర్ధాలు కూడా ఇమిడి వున్నాయి....ఇన్ని కారణాలతో విపుల భద్ర మూర్తి గా వున్నాడు అంట...

విపుల భద్ర మూర్తి అంటే నమ్మతగిన వాడు అనే కాదు...

విపుల అంటే అమరకోశం ప్రకారం భూమి, విస్తారమైన భూమి అని అర్థం.

కాని మనం ఇచ్చట....

మానవుడు కర్మ బద్ధుడై జీవనం వలన సంచిత ప్రారబ్ధం లతో అనేకానేక జన్మలు కలిగి వుంటున్నాడు...

మరి ఈ సంచిత ప్రారబ్ధం ను నివారించి

జన్మరాహిత్యం అయిన మోక్షం కలగటానికి ఎవరిని ఆశ్రయం చేయాలి... రాముని ఆశ్రయం చేయాలి...ఆయనే భద్రం నమ్మకం... అందుకే విపుల భద్ర మూర్తి వాడు అనే ప్రయోగం.

తరువాత పాదం...

"రాజముఖ్యుండోకరు

డదే కనుగవకు ఎదురు కానబడియే"

అంటే...రాజుల లోని ముఖ్య వ్యక్తి తన కన్నుల ముందు కనపడినారు అని తెలుపు తున్నారు...

మరి అంతరార్ధం ఏమిటో....

రాజు అంటే మీకు తెలిసినదే...రాజు పాలకుడు గాను పాలితులుగా ప్రజలు వుంటారు...

మనకు గత కాలంలో రాజు అనే ఆయన దైవాంశ సంభూతుడు అనే నమ్మకం వున్నది.

కాని ఇక్కడ వున్న రాజు అయోధ్య రాజుగారు... ఆయనే స్వయం విష్ణుః శ్రీరామ చంద్రుడు... అయోధ్య రాజ సారధ్యం లో సకల భూమండలం వున్నది...మరి పాలితులు ప్రజలు , మరియు ఆయన భక్తులు....

అంటే దేవతా స్వరూపాలు లో ముఖ్యమైనది శ్రీరామ చంద్రుడు అని ఆయన ఉద్దేశ్యం...

"కను గవకు ఎదురు కాని బడియే"

ఇందులో విశేషం కను గవ....

అంటే కన్నులు అని అర్ధం...కాని మనం మరికొంత తెలుసు కొందాం...

కన్నులను "కిటికి" లతో పోలిక వున్నది.

'కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు'

అని మనం చిన్నప్పుడు పొడుపు కధలు చదువుకున్నాం....దాని విడుపు ఏమిటో అంటే కళ్ళు అని చెప్పి సంబర పడే వారం.

కిటికి కి మరో పేరు గవాక్షం....

మరి దీని కర్తవ్యం ఏమిటో గమనిస్తే...

ఇంటి గదిలో వుండి బాహ్య దృశ్యం దర్శించుటకు అనువుగా వుండునది.

అంటే నీవు వున్న ప్రదేశం వాతావరణం వేరు గవాక్షం గుండా నీకు గోచార దృశ్యం వేరు ...ఈ రెండింటికి విభజన గవాక్షం...

అలాగే గవ్వ అంటే మీకు తెలుసు...

గవ్వ అనేది సముద్ర జీవి తన రక్షణ కొరకు నిర్మించుకునే ఒకానోక కవచం...

మరి సముద్రం, జీవికి మధ్య వుండేది గవ్వ... ఇంత వరకూ సరిపోతుంది అని నా భావన....

ఇక ఇప్పుడు కనుగవ అనే పదం...

పోతన గారికి రాముల వారు ఎప్పుడూ దర్శనం ఇచ్చారు అంటే...పోతన గారు యోగ ధ్యానం లో వున్న సమయంలో ఆయన మనో నేత్రం పై సాక్షాత్కరించారు అని మనం అర్ధం చేసుకోవాలీ....

రామ సాక్షాత్కారం అంటే సశరీర సాక్షాత్కారం అని మీరు ఎన్నడూ భావన చేయరాదు.

అలాగైతే కను దోయి అనే పద ప్రయోగం వుండేది....

పోతన గారి లాంటి వారికి ఇటువంటి వాటిపై అవగాహన వున్నది.

కారణం త్రేతా యుగం నాటి రాముడు,

కలి యుగం నాటి పోతన గారికి సశరీరం అంటే అభూత కల్పన అవుతుంది అని తెలుసు.

అదియునూ కాక దేవతా దర్శనాలు ఎప్పుడూ స్వఫ్న సాక్షాత్కారం, యోగ, ధ్యాన సాక్షాత్కారం అని మనం గమనించాలి....

ఇది ఇంత వరకూ మొదటి పద్య వివరణ....

రెండోవ పద్యం... "పలికేడేది భాగవతం"

తరువాయి భాగం లో...నేను క్లుప్తంగా రాయాలని భావన చేస్తాను...కాని వివరణ సమయంలో స్వామి వారు మరి కొంత స్ఫురణ కు తెచ్చి ఇంకొంత వివరం తెలుపమని ఆదేశంతో...దాని అంతరార్థం...మరి కొంత అర్ధ వివరణ చేరి విస్తారం అవుతుంది....

మిత్రులు అన్యధా భావించక...మన్నించండి.

అలాగే ఈ రచన పై భూషణలు అన్నీయునూ శ్రీరామ చంద్రుడు వి...మీరు చదివి శ్రీరామ రామ రామ అని ఒక్క సారి అంటే ఆయన ప్రసన్నుడై మీకు ఆయన ప్రపన్నత లభిస్తుంది...

ఇక దూషణలు అన్నీయునూ నావే...

మీరు నిరభ్యంతరంగా... నిర్మొహమాటంగా ఈ రచనలోని తప్పులు తెలియచేసిన సరిదిద్దుకుంటాను...

ఆలపాటి రమేష్ బాబు

శ్రీ సంతోషి సాయి బుక్ డిపో

విజయవాడ...

94401 72262.

తదనంతర భాగం కోసం మెసేజ్ పెట్టండి.