4, ఆగస్టు 2020, మంగళవారం

నిర్వాణషట్కం

జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత ''నిర్వాణ షట్కం'' 

**********

ఇది  'నిర్వాణ షట్కము'నకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది.  నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆదిశంకరుల సారస్వతాన్ని క్లుప్తంగా పరిచయం చేయడానికి నాకున్న కొద్దిపరిధిలో, అల్పజ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.

ఆధునిక పోటీ పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో, (నెగెటివ్ మార్కింగ్) అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని చివరికి సరిఐన లేదా సరిఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి','నేతి', అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ 'నిర్వాణ షట్కము' లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్నిఅదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు!

మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే, శివుడనే. నేను అంతః కరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు, నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు, ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను. ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచభూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా పంచ మహా భూతములు ఐన ఆకాశము,అగ్ని,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి, వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.

నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను, సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామయిచ్చను తీర్చుకునే ఇంద్రియమును కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను, చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే!

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు, మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే పురుషార్ధములూ లేవు, ఎందుకనగా, నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక, నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం

నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, నేను శివుడను!

న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన, మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు, గురు శిష్యులు, ఏ బంధములు లేవు, ఎందుకనగా, నేను శివుడను కనుక, అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!

అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంబంధించినవి, సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది.

కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే., 'నాది', 'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవాలేదు ఎవరికీ కాకూడదు, నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈ నాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం! బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది.

అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది. ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ. నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది. ఈ రెండూ మంచివే.అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తామసికమైనది, అది దాన్ని కలిగివున్నవాడిని, వాడి ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.

"ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, ఆత్మేంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః " ... అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కేవాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసుఅనే కళ్ళెంతో అదుపు చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, దానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వభావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది. కనుక శివోహం, శివోహం! బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ దారి తప్పవు, మంచికర్మలే మిగులుతాయి, మంచిజ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌతాడు మానవుడు, కనుక ఇంతా కలిగిన శివుడనే నేను! సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను, ఎందుకంటే దేహం శాశ్వతం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది, ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, 'జీవం ఉన్నంతకాలం జీవునితో వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది' కనుక, దానికి మరణం లేదు, కనుక ఆది శాశ్వతం. ఈజ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు, సుఖ దు:ఖాలు, మొదలైన ద్వంద్వాలుండవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే, కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచమహాభూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!

యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ....
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి....
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం...
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే...
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే!!!

ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది మనసు ద్వారా తెలిసికొన బడజాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో, ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేనిద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో, దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము, వేరేది ఏదీ కాదు, అని చెప్పింది ఒక ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్నవాళ్ళు కూడా పలుకలేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపులేని వాళ్ళు గుడ్డివాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో, దానివల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో, .అదియే బ్రహ్మము. అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉందికదా, అదే బ్రహ్మం. పంచకర్మేంద్రియాలూ, పంచ జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికిరాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుకలేదు, చేతులున్నా పనులు చేయ లేవు, కాళ్ళు వున్నా నడువలేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింపలేదు, కనులు వున్నా చూడలేవు, చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు, సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచ కోశాలు వున్నా పనికి రావు. ఇవన్నీ వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీఅశాశ్వతాలు అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు,

క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడనై  పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!

"అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే"

అన్నది ఒక ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియజేస్తూ. ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు, అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు, కనుక మృత్యు భావం వుండదు, కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ, ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావులేని ఆత్మజ్ఞానం అని అర్థం! ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక. ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!

ఇన్ని ఉపనిషత్తుల మర్మాలను స్ఫురింపజేస్తూ, నిత్యమూ శివమూ, శాంతమూ, అద్వైతమూ ఐన పరమాత్మఅనుభవమునకు సంబంధించిన బ్రహ్మానందానుభూతిని పొందటానికి కావలసిన సాధనా విధానాన్ని, భావనా విధానాన్ని ఈ  'నిర్వాణ షట్కము' లో తెలిపి పరమోత్క్రుష్టమైన వేదాంత దర్శనం చేశారు ఆదిశంకరాచార్యుల వారు. నా అల్పబుద్ధికి అందినమేరకు  ఆ విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రేరణనిచ్చిన ఆదిశంకరుల పాదపద్మములకు వినయంగా అంజలిస్తూ, స్వస్తి!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.