ఒక అందాల అద్బుతం, ఒక వసంత సమీరం, మెరిసే మెరుపు, అనంత ఆత్మీయత, ఒక అల్లరి, ఒక పెంకి, కొద్దిగా కోపం, ఇంకొద్దిగా అలక, అందరికన్నా చిన్నది, అన్నిటా తానే, ఒక అనంత శక్తీ రూపం, అమ్మకు బొమ్మ, అన్నయ్యకు ముద్దుల చెల్లి ,నాన్నకు "అమ్మ"........అమ్మ అంటే నిజంగా అమ్మ
4, ఆగస్టు 2020, మంగళవారం
అమ్మరో
నిర్వాణషట్కం
జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత ''నిర్వాణ షట్కం''
**********
ఇది 'నిర్వాణ షట్కము'నకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆదిశంకరుల సారస్వతాన్ని క్లుప్తంగా పరిచయం చేయడానికి నాకున్న కొద్దిపరిధిలో, అల్పజ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.
ఆధునిక పోటీ పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో, (నెగెటివ్ మార్కింగ్) అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని చివరికి సరిఐన లేదా సరిఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి','నేతి', అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ 'నిర్వాణ షట్కము' లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్నిఅదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు!
మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం
నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే, శివుడనే. నేను అంతః కరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు, నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు, ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను. ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచభూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా పంచ మహా భూతములు ఐన ఆకాశము,అగ్ని,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి, వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.
నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం
నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను, సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామయిచ్చను తీర్చుకునే ఇంద్రియమును కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను, చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే!
న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం
నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు, మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే పురుషార్ధములూ లేవు, ఎందుకనగా, నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక, నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం
నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, నేను శివుడను!
న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం
నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన, మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు, గురు శిష్యులు, ఏ బంధములు లేవు, ఎందుకనగా, నేను శివుడను కనుక, అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం
నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంబంధించినవి, సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది.
కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే., 'నాది', 'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవాలేదు ఎవరికీ కాకూడదు, నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈ నాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం! బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది.
అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది. ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ. నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది. ఈ రెండూ మంచివే.అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తామసికమైనది, అది దాన్ని కలిగివున్నవాడిని, వాడి ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.
"ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, ఆత్మేంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః " ... అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కేవాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసుఅనే కళ్ళెంతో అదుపు చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, దానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వభావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది. కనుక శివోహం, శివోహం! బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ దారి తప్పవు, మంచికర్మలే మిగులుతాయి, మంచిజ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌతాడు మానవుడు, కనుక ఇంతా కలిగిన శివుడనే నేను! సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను, ఎందుకంటే దేహం శాశ్వతం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది, ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, 'జీవం ఉన్నంతకాలం జీవునితో వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది' కనుక, దానికి మరణం లేదు, కనుక ఆది శాశ్వతం. ఈజ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు, సుఖ దు:ఖాలు, మొదలైన ద్వంద్వాలుండవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే, కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచమహాభూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!
యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ....
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి....
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం...
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే...
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే!!!
ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది మనసు ద్వారా తెలిసికొన బడజాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో, ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేనిద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో, దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము, వేరేది ఏదీ కాదు, అని చెప్పింది ఒక ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్నవాళ్ళు కూడా పలుకలేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపులేని వాళ్ళు గుడ్డివాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో, దానివల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో, .అదియే బ్రహ్మము. అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉందికదా, అదే బ్రహ్మం. పంచకర్మేంద్రియాలూ, పంచ జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికిరాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుకలేదు, చేతులున్నా పనులు చేయ లేవు, కాళ్ళు వున్నా నడువలేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింపలేదు, కనులు వున్నా చూడలేవు, చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు, సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచ కోశాలు వున్నా పనికి రావు. ఇవన్నీ వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీఅశాశ్వతాలు అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు,
క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడనై పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!
"అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే"
అన్నది ఒక ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియజేస్తూ. ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు, అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు, కనుక మృత్యు భావం వుండదు, కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ, ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావులేని ఆత్మజ్ఞానం అని అర్థం! ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక. ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!
ఇన్ని ఉపనిషత్తుల మర్మాలను స్ఫురింపజేస్తూ, నిత్యమూ శివమూ, శాంతమూ, అద్వైతమూ ఐన పరమాత్మఅనుభవమునకు సంబంధించిన బ్రహ్మానందానుభూతిని పొందటానికి కావలసిన సాధనా విధానాన్ని, భావనా విధానాన్ని ఈ 'నిర్వాణ షట్కము' లో తెలిపి పరమోత్క్రుష్టమైన వేదాంత దర్శనం చేశారు ఆదిశంకరాచార్యుల వారు. నా అల్పబుద్ధికి అందినమేరకు ఆ విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రేరణనిచ్చిన ఆదిశంకరుల పాదపద్మములకు వినయంగా అంజలిస్తూ, స్వస్తి!
రామో విగ్రహన్ ధర్మః
రామో విగ్రహన్ ధర్మః
ఈ వాక్యం రాముని ధర్మనిరతిని సూచిస్తూ పలువురు ప్రస్తావిస్తారు. అయితే రామాయణం లో ఈ వాక్యాన్ని వాల్మీకి గారు మారీచునితో అనిపిస్తాడు. వినటానికి మనకు గమ్మత్తుగా వున్నది. మారీచుడు ఏమిటి రాముని అంతలా విగ్రహన్ ధర్మః అనే అంతగా...వివరాలు లోకి వెళితే ...మారీచుడు రావణాసురిని వద్ధ ముఖ్యుడు. ఏంత అంటే రావణాసురిని అంతరింగక వర్గంలోని ముఖ్యుడు రావణాసురిని బంధువు. తాటకి కుమారుడు. తాటకి రావణాసురిని అమ్మమ్మ. అంటే మారీచుడు రావణాసురుని మేనమామ. ఇది వారి సంబంధం. ఇంత విశ్వసనీయత వారి మధ్య వున్నది.
రావణుడు మారీచుని సీతాపహరణంనకు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మారీచునకు అంతకు క్రితమే విశ్వామిత్రులతో యాగసంరక్షణార్ధం వచ్చిన రాముని చేతిలో తనతల్లి మరణం , తనసోదరుడు సుబాహు మరణం ఇత్యాదులవలన మరియు సహజ సిద్ధమైన తన రాక్షసమాయలతో ప్రజలద్వారా చారుల ద్వారా ఇలే అనేక విధాలుగా రామచంద్రుని ధర్మనిరతి ఆయన వీరత్వం కర్తవ్యపరాయణత్వం రాముని బాణం యొక్క వాడి వేడి తెలిసిన వాడగుటచేత రావణాసురునికి సీతాపహరణం కూడదు అని హితవు చెప్పే సమయంలో రావణాసురిని ఉద్దేశించి ఉద్దశేంచి " రామో విగ్రహన్ ధర్మః" అని ప్రస్తావిస్తాడు. రావణా విను రాముడు మామూలు వాడు కాదు ధర్మం పోత పోసి సశరీరంగా నడయాడే స్వరూపం అటువంటి ధర్మశిఖతో ప్రజ్వరిల్లే రాముని ధర్మపత్నిని అపహరించమంటున్నావు నీవు శలభంలా మాడిపోతావు అంతేకాదు నీవు , నీతో అనుసరించిన నేను , మేము కడకు ఈ రాక్షసజాతి వినాశనమునకు ,లంకకు మంగళకరము కాదు అని పలువిధాలా బ్రతిమలాడుతాడు కాని వినడు చివరకు విధిలేని పరిస్థితి లో బంగారు జింక వేషం ధరించి వెళ్ళి రామబాణం తగిలి మరణిస్తాడు కాని రాక్షస బుద్ధిగా చనిపోయో సమయంలో హలక్ష్మణా అనే ఆర్తనాదాలు చేసి చనిపోతాడు.తదుపరీ సీతాపహరణం , ఆతదుపరి రావణసంహరం . ఇది అంతా రాముని ధర్మనిరతిని తెలుసుకోవటమో. అందుకే రామో విగ్రహన్ ధర్మః.
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ.
94401 72262.
లోకఃసమస్తా సుఖినో భవంతు
లోకఃసమస్తా సుఖినో భవంతు.
*********************************
లోకః సమస్తా సుఖినోభవంతు. ఈ వాక్యం మనలో చాలా మంది అనేకసార్లు విని , చదవి వుంటారు. కాని దీని విశేషం తెలుపుటతో పాటు
వర్తమాన కాల అన్వయం చేసి మన భరతజాతి గొప్పదనాన్ని పునఃశ్చరణ చేయిటయే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.
మన భరతజాతి లో హైందవం అనేది నేడు మతము అయినా ఇది ఓ జీవనమార్గం అనేది సత్యం.
మనం తెలుసుకో కోరే వాక్యం స్వస్తి వచనాలలో ఓ భాగంగా వున్నది. ఈ స్వస్తి వాక్యాలు మనం విశేషకార్యక్రమాలు నిర్వహించినప్పడు ఆకార్యక్రమం చివరలో బ్రహ్మగారు ఈ క్రింది మంత్రాలతో దీవిస్తారు అవి...
*******
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!
న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!
గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
అపుత్రాః పుత్రిణస్సంత్తు,పుత్రిణస్సంత్తు పౌత్రిణః!
అధనా స్సధనా స్సంతు జీవంతు శరదాం శతం!!
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే!
వృతనాళౌ సమభవత్ తత్తే భవతు మంగళం!!
ఋతవ స్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చతే!
మంగళాని మహారాహో దిశంతు తవ సర్వదా!!
పై శ్లోకాలు కి అర్ధం
శుభం కలుగుగాక! ప్రజలకి, న్యాయమార్గంలో వుండి ఈ భూమిని ప్రజలను ,రక్షించు ప్రభువులకి.
గోవులు , బ్రాహ్మణులకు సదా శుభం కలుగుగాక.
లోకములో అందరు శుభముగా వుందురుగాక.
అన్నీకాలములలోను భూమిపైన వర్షాలు కురిసి పంటలు పచ్చగా పండుగాక.
దేశాలు అన్నీ ఈతి భాధలు కరువు కాటకాలు లేకుండా వుండుగాక , బ్రాహ్మణులు వారి సంతానం వారి గురుకులాలు శుభంగా వుండుగాక.
పుత్రులు లేని వారికి పుత్రులు , పుత్రులు వున్నవారు పౌత్రులు ప్రపౌత్రులతో శుభంగా వుండుగాక.
ధనంలేని వారు ధనం కలిగి , ధనం కలిగిన వారు పాడి పంటలతో చల్లగా వందసంవత్సరాలు జీవింతురుగాక.
మాకు జయం కలిగించు ఇంద్రాది దేవతలకి శుభం.
ఈ జీవనచక్రమార్గం నుంచి ఆత్మదర్శనం కావించే భగవంతునికి శుభం.
సకల సమాయాలలో సకల దిక్కులలో శుభం కలుగుగాక.
చూశారా వేల సంవత్సరాలుగా ఈ వేదభూమిలో ప్రతి ఓక్కరి మనుగడ ప్రతి జీవ జాలం మనుగడే మన కాంక్ష ఆకాంక్ష...ఈ పద్ధతే మన జీవన విధానం.
కాని వర్తమానం లో ఈ భూగోళం పై జరుగుతున్న విధానం ఏమిటి... మేము మాత్రమే బాగుండాలి అన్న అహంకార పూరిత విధానం ప్రదర్శించిన ప్రతి సమయంలో కాలపురుషుడు ప్రకృతి రూపంలో ఈ వైపరిత్యం ను సమం చేసే వెళుతున్నారు...కాలపురుషుడు తన పాఠాలు నిర్దయగా చెప్పుకుంటూ వెళుతున్నా మూర్ఖ పద్ధతిలో వున్న అనేక దేశాలకి వర్తమాన వైరస్ ఓక దండనే...ఈ వైరస్ ప్రారంభ దేశం నుంచి గమనించండి...వాళ్ళు నిజం చెప్పటానికి సిద్ధంగా లేరు కాని..ఆ దేశంలో అనేక వేల మరణాలు...మరి అగ్ర రాజ్యంలో మరణాలు లెక్క కొనసాగుతుంది...మతవాదంతో , కుట్రలు కుహకాలతో నిండిన ఇటలి పీనుగల పోగు...మరి కొన్ని దేశాలది అదే పరిస్థితి... అంత ఎందుకు మన ప్రక్కనే వుండే పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి వున్నవాడు ఎవరో చచ్చేవారు ఎవరో తెలియని దిక్కుమోక్కులేని స్థితి....
ఇలా గమనించండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భారతదేశం బాగానే వున్నది. మేమే బాగుండాలి అన్న ప్రతి ఓక్క దేశంనకు ఈ కరోనా వైరస్ శిక్ష గా తన భాధ్యత నేరవేర్చాడు కాలపురుషుడు.
"లోకః సమస్తా సుఖినో భవంతు"
" మన సంకల్పం ఓకటై వుండుగాక
మన భావం ఓకటై వుండుగాక
మన చింతన ఓకటై వుండుగాక
మన మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక"
(అధర్వ - 6 - 64 - 4)
ఓం శాంతి శాంతి శాంతిః.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ
94401 72262..
రుద్ర నమక చమక పారాయణ విశేషాలు
మార్కండేయుని చరిత్ర - మరి కొన్ని విశేషాలు
భావయామి గోపాలబాలం..నా భావనలు
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..వివరణ
"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఎనుగులు తిన్న వెలగపండు జీర్ణం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం కృష్ణుని తిన్న వెన్న ముద్ద జీర్ణం ఈ పాపాయి తినే పాల బువ్వ జీర్ణం..."
బహుశా ఈ శ్లోకం తెలియని తెలుగువారు వుండరు. మన ఇండ్లలో పసివారికి పాలబువ్వ తినిపించిన తరువాత తల్లులు పాపాయికి తినిపించిన పాలబువ్వ గిన్నేను దిష్టి తీస్తూ
పై పద్యం చదువుతారు.
హైందవ సాంప్రదాయం లో జాతకర్మలైన షోడశకర్మలలో ఏడవది అన్నప్రాసన.
శిశువు జన్మ లగాయితు మాతృ స్తన్యం తో అతని జీవన అవసరాలు తీరుతాయి. ఆరు నెలల తరువాత శిశువు ఎదుగుదలకు శారీరక పటుత్వానికి స్తన్యం చాలదు. అదియును గాక మహిళ శారీరక నిర్మాణం వలనకాని , నిత్యకృత్యాలైన గృహకృత్యాల వలన కాని , సంసార జీవనం ప్రారంభం వలన కాని ఆమేయందు స్తన్యం లభించటం తగ్గుతుంది. అందువలన శిశువు కు ఘన ఆహరం పెట్టాలి. ఈ విషయం సుశ్రుతుడు కూడా తన గ్రంధాలలో తెలిపియున్నాడు. దీనినే మన వారు వేదోక్తంగా మంత్రబద్ధంగా షోడశ కర్మలలో ఓకటిగా ఆచరిస్తున్నారు. తదాదిగా శిశువుకు తెలికగా జీర్ణం అయ్యే పాల బువ్వ తినిపిస్తారు.
అన్నం ప్రాణ ఆధారం, జీవ ఆధారం. దీనిని ఆశ్రయించి అనేక పాప పుణ్యాలు వుంటాయి.
శిశువు భూవాతావరణం వచ్చిన తదాదిగా ఈ భూప్రపంచంలో వున్న కర్మలు ప్రారంభం అయితే అది స్టేజి ఓకటి అయితే అన్న ప్రాసన నుండి మరో స్టేజి .
ఇది అలావుంటే ఇక మన శ్లోక వివరణకు వస్తే...
అహరం ఆశ్రయించి అనేక సూక్ష్మ జీవులు , ఆహరం పులిసి పాడయిపోయి విషతుల్యం అయి ఓక్కోసారి ప్రాణం మీదకు వస్తాయి. దీనిని సూచిస్తూ రామాయణం లో ఓకధ వున్నది.
వాతాపి , ఇల్వలుడు అనే సోదరులు రాక్షసులు. వీరు అనేక కపట మాయోపాయాలతో ప్రజలను చంపి తింటారు. వీరిలో వాతాపి మేక రూపం ధరిస్తాడు. ఇక ఇల్వలుడు దారిన పోతున్న సాధుజనులను , బుషుల వద్దకు వెళ్ళి అయ్యా ఈ రోజు మాతండ్రిగారి ఆబ్దీకం మీరు భోక్తగా రావాలి అని ఆహ్వానిస్తాడు. సరే అని వెళ్ళిన అతిధికి మేక రూపంలో వున్న వాతాపిని వధించి భోజనంగా వడ్డిస్తాడు. అతిధి భోజనం ముగియగానే ఇల్వలుడు వాతాపి రా..అని పిలుస్తాడు..దానితో అతిధి కుక్షి చీల్చుకుంటూ వాతాపి వస్తాడు . దీనితో మరణించిన అతిధిని సోదరులు ఇరువురు శుభ్రంగా తినేస్తారు.
వీరి ఈ క్రూర కార్యం వలన ప్రజలు భయవిహ్వలు అయి అగస్త్యమహర్షిని శరణు కోరతారు. సరే అని అభయమిచ్చిన అగస్త్యులవారు వారి అతిధిగా వెళ్లి భోజన కార్యక్రమం అవగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రం పలుకు తారు. దీనితో అగస్త్యులవారి మంత్రశక్తికి వాతాపి జీర్ణం అయిపోతాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి రా అని పిలుస్తాడు కాని ఇంకేక్కడ వాతాపి వాడు ఎప్పుడో అగస్త్యులవారి కుక్షిలో జీర్ణం. ఇది కధ కాని పరిశీలిస్తే...సోదరులు ఇద్దరు వైరస్ లు గా ఆహరాన్ని పాడుచేసేవారుగా భావన చేయాలి. ఇక వాతాపి మేక రూపం చూడండి..మేక ఓక్కటే కనపడిన ప్రతి ఆకును మేస్తాయి...ఇది అది అని లేదు ప్రతి ఆకును ఆబగా మేస్తూనే వుంటాయి. అందువలన వాటి జీర్ణవ్యవస్థ సరిగా వుండక మేక విసర్జన పెంటికలుగా గోలిలుగా వుంటుంది.
ఇటువంటి లక్షణాలు శిశువుకూడా వుంటాయి...శిశువు దోగాడుతున్నప్పుడు, పాకుతున్నప్పుడు ఏది కనపడితే అది ..అతనిని ఆకర్షించిన ప్రతి ఆహర , వస్తు సంచయాలను నోట్లో పెట్టుకుంటాడు దాని వలన అతనికి విరోచనాది లక్షణాలు కలుగుతాయి...అందుకే వాతాపి లాంటి రాక్షసుడే జీర్ణం అవ్వగా తల్లి తన మాతృహృదయ మమకారంతో తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కలగాలని కోరుకుంటుంది.
ఇక రెండోవ వాక్యం ఏనుగులు తిన్న వెలగుపండు జీర్ణం. సహజంగా ఏనుగు భారి పరిమాణంలో వున్నను దానికి దంతాలు బాహ్యంగా వుండి చమన పద్దతి అనగా నమిలే అవకాశం లేక అన్నీటిని అలా మ్రింగుతాయి . వెలగపండు లోపల గుజ్జు వుంటుంది. దాని చుట్టూ వున్న దాని ఉపరితల భాగం బాగా కఠినంగా వుంటుంది. కాని ఏనుగు పొట్టలోనికి వెళ్ళిన వెలగపండు అక్కడి ఉష్ణోగ్రత కి లోపలి గుజ్జు జీర్ణం అయి విసర్జకంగా పండు పండుగానే వస్తుంది. ఇది మనకి గమత్తుగా వింతగా వున్నను ఇది వాస్తవం. చూడండి ఏనుగు లక్షణం ఆహరభాగం మాత్రమే స్వీకరించి పిప్పి భాగాన్ని విసర్జిస్తుంది.
కనుక తల్లికి తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కావాలనే అర్ధం. ఇక ఇంకో అంతరంగీక అర్ధం వున్నది. గజముఖుడు వినాయకుడు అన్న సంగతి తెలిసినదే. మరి వినాయకుని విఘ్నాధిపతిగాను , విద్యలకెల్ల ఒజ్జ అయిన గణాధిప అనే భావంలో కొలుస్తాం. మరి ఇంతటి మహనీయిడి లక్షణం మాతాపితురుల ప్రదక్షిణం భూప్రదక్షిణం అని నమ్మీ విజయం పొంది విఘ్నాధిపత్యం స్వీకరిస్తాడు. కనుక తల్లికి తన బిడ్డ మంచి విషయాలు మంచి జ్ఞానం తల్లితండ్రులపట్ల ప్రేమ , బిడ్డశరిరంలో జీర్ణం అవ్వాలని కోరికతో ఏనుగులు తిన్న వెలగపండు జీర్ణం అంటారు.
ఇక మూడవ వాక్యం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం. గుర్రం అత్యంత వేగంగా పరుగు తీయగల జీవి. అలాగే గుర్రం ఎన్నడూ నేలపై పడుకోదు ...నించునే నిద్రపోతాయి...వాటి శక్తి అనంతం . అందుకే మన మోటారులను కూడా అశ్వశక్తితో పోల్చుతాం. ఇంతటి చలన శక్తికి వాటి కాళ్ళకున్న గిట్టలే కారణం. వీటి వలన కొండలు లాంటి కఠిన ప్రదేశాలలో కూడా పయనం. మరి వీటి ఆహరం గుగ్గిళ్ళు. మరి తల్లి అందుకే తన బిడ్డకు అశ్వం లాంటి శక్తి కోరుతున్నది. ఇది జీవలక్షణం. ఇక దైవరహస్యం పరిశీలించుదాం. హయగ్రీవుడు వైష్ణవసాంప్రదాయంలో సకల విద్యాధిపతి. వీరి తల గుర్రం గా వుంటుంది. తలమాత్రమే గుర్రంగా వుండటం అంటే మన మేధ అంత వేగంగా వుండాలి అని. జ్ఞాన స్వీకరణలో అంత వేగంగాను అంత స్థిరంగా వుండాలని. మన మెదడు అనేక ఆలోచనలు స్వీకరించి శోషణ చేసి తృటిలో మంచి చెడులను మనకు తెలియచెప్పుతుంది. అంటే ఈనాటి అడ్వాన్స్ ప్రోసేసర్ పని అంతా మన మెదడు నిర్వహిస్తుంది. కాబట్టి తల్లి తనబిడ్డ అంత జ్ఞానసంపన్నుడు , వేగ కార్య నిపుణుడు కావాలని గుర్రాలు తినే గుగ్గిళ్ళు జీర్ణం అని పలుకుతుంది.
ఇక నాలుగో వాక్యం కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం. వెన్న ,పెరుగు చిలకగా మజ్జిగ మరియు వెన్న వస్తుంది అన్న విషయం సర్వులకి విదితమే. పాలు కాచి తోడు వేయగా పెరుగు ఏర్పడుతుంది. పాలు తోడు వేయటం వలన ఈష్ట్ గా మారి ..పెరుగు ఏర్పడుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో ఫెర్మంటేషన్ అంటారు. పెరుగు రుచిగా వున్నను వాత లక్షణం కలది. అందుకే రాత్రి ఆహరంలో పెరుగు నిషిద్ధం. మరి ఈ పెరుగు చిలకగా ఆ ఉష్ణంనకు అందులోవున్న ప్రోటిన్ మరియి శక్తినిచ్చే పదార్థాలు వెన్నగాను . మిగిలిన ద్రవరూపం అంతా మజ్జిగ గాను ఏర్పడుతుంది. మరి కృష్ణుడికి ఇష్టమైన వెన్న వలనే ఆయన క్రీడా వినోదాలు , రాసలీలలు , లీలామానుషత్వ లక్షణాలు , సర్వులను అతను ఆకర్షించే లక్షణాలు , స్థిరమైన పురుషత్వ లక్షణాలు ఏర్పడుతాయని తల్లి నమ్మకం. అందుకే తన బిడ్డ కూడా కృష్ణుడంత మహనీయుడు కావాలని కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం అని పలికేది. చూశారా మన దేశంలో ప్రతి తల్లి దేవకి , యశోదలే ప్రతి శిశువు చిన్ని క్రిష్ణుడే....
ఇక చివరిదైన పాపాయి తిన్న పాల బువ్వ జీర్ణం.
ఇది మామూలే తన అనురాగతో ప్రేమతో తినిపించే పాల బువ్వ వలన శక్తితో ఆరోగ్యంతో తన బిడ్డ కలకాలం మనుగడ సాగించాలనే ఆకాంక్ష.
చూశారా మీకు ఓ చిన్న శ్లోకం లాగా పద్యపాదం లా కనపడే ఈ నాలుగు వాక్యాలలో మన పూర్వీకులు ఇంత అంతరార్ధం లో మనకు సాంప్రదాయాలుగా ఆచారాలుగా ఏర్చి కూర్చినారు.
ప్రతి శిశువు కి తల్లి చక్కని ఆరోగ్యవంతమైన ఆహరం అందచేయాలని , వారికి లభించాలని శ్రీరాముని ప్రార్ధిస్తున్నాను.
సకలం సర్వం శ్రీరామ జయం.
చదివి నచ్చినవారు ఓ చిన్న నవ్వు...సందేహం వున్నవారు తెలపండి నివృత్తికై...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.
సామజ వర గమనా - శంకరాభరణం.. ఓ పరిశీలన
సామజవరగమన - శంకరాభరణం ఓక పరిశీలన.
మానవమేధో వికాసంలో లలిత కళలు ఓక విభిన్నపరిణామం. లలితకళలలో సంగీతం మరి విశిష్టమైనది. సప్తస్వరాలు స , రి , గ , మ , ప ,ద ,ని. ఈ ఏడు స్వరాల కలయికే అనంతకోటి రాగాలు . ఈ సంగీత శాస్త్రం బహు విస్తారమైనది. ఇందు లయ , శృతి ప్రధాన్యత వహిస్తాయి. ఈ సంగీత సాధనలో మనస్సు కేంద్రీకరించి శృతి ,లయలతో పాటు రాగయుక్త స్వరసహితంగా పాడగలిగినదే సాంప్రదాయ కర్నాటక సంగీతం. మన భారతదేశ సంగీతాన్ని దక్షిణ భారత సాంప్రదాయం కర్నాటక సంగీతంగా , ఉత్తర భారత సాంప్రదాయం హిందుస్తాని సంగీతంగా ప్రాధమికంగా విభజించారు. మరలా ప్రాంతాలని అనుసరించి మత పరంగా జరిగే కార్యక్రమాలను అనుసరించి అనేక విభజనలు. మరలా ఇందులో గాత్ర సంగీతం వాయిద్య సంగీతం అనే విభజనలు....
ఇలా మీకు కూలంకషగా వివరించాలని వున్నా ప్రస్తుత అంశంనకు అణుగుణంగా వివరించవలసి వున్నందున విస్తారభీతిచే ఇంతవరకూ చాలు...ఇక అంశం పరిధిలోకి వద్దాం......
మన దక్షిణ భారత సంగీతంలో విశిష్టమైనది త్యాగరాజకీర్తనలు. త్యాగరాజుగారు ప్రస్తుత తమిళనాడు లోని తిరువైయ్యారులో జన్మించిన అచంచల రామభక్తుడు. ఆయన రాముని పరంగా ఏన్నో వేల కీర్తనలను సృజించారు....
అందులో ఓక కీర్తన సామజవరగమన....
సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :
హిందోళరాగం , ఆది తాళం...
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥
ప్రతి పదార్ధం :
సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా
సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా
కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా
సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ
గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ
మాంపాలయ – నన్ను పాలించు
వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన
సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా
స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా
మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;
త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా
అర్ధం:
ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..
సామావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మమ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..
ఇది భక్తి పరంగా...శ్రీకృష్ణుని పరంగా...మన సాంప్రదాయ కీర్తన.....
ఇక శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ప్రాశస్త్యం మనందరికి తెలిసినదే....అదో గర్వించదగ్గ తెలుగు సినిమా...
ఇందులో ఓ సాంప్రదాయ సంగీతకారుని జీవన వైభవాన్ని...కాల మహిమచే సమాజ నిరాదరణ వలన అతని జీవనంలో ఓడిదొడుకులను దర్శకులు విశ్వనాధ్ గారు ఏంతో చక్కగా దృశ్యకావ్యంలా వివరించారు...
శంకరశాస్త్రికి సంగీతం అంటే ప్రాణ సమానం...
ఓక రాగం ఆలాపన చేయాలంటే స్వరసహితంగా ఎక్కడా పొరపాటు పోనివ్వని నైజం...మనకు ఇదే విషయాన్ని శంకరశాస్త్రి తన కుమార్తె కి కృష్ణానదినీటిలో మంచులో గొంతువరకు చిన్న పాపను వుంచి సంగీత సాధన చేయించే దృశ్యం మనకు ఉపమానంగా చూపుతాడు. ఆ పాప సాధనలో ఓక స్వరం తప్పుగా పలకగానే..శంకరశాస్త్రి...ఊ ....అనే హూంకారంతో స్వరంను షరిదిద్దటం కూడా మీరు గమనించవచ్చు...ఈ దృశ్యం చూసిన వారికి శంకరశాస్త్రి శుద్ధ ఛాంధసుడిలాగా...ఫక్తూ సాంప్రదాయవాది లాగా కన పడతాడు...కాని సాంప్రదాయ సంగీత కారుల సాధన వైశిష్ట్యాన్ని మనకు దర్శకుడు ఈ విధంగా స్పృశించారను కోవచ్చు...
ఓక రాగా ఆలాపాన స్వరసహితంగా ఆరోహణ ,అవరోహణ స్వర ప్రస్తారాలు తప్పు పోకుండా వుండాలి అంటే కఠోర సాధన మరియి మానసిక పరిపక్వత , మానసిక నిగ్రహం తద్వారా శరీరం ప్రతి అణువు సంగీతంకై కేటాయించిన విధంగా తయారవుతుంది.
ఇక సినిమా విషయానికి వస్తే....శంకరశాస్త్రి జీవితం కాలమహిమచే కష్టాలపాలు...కచేరిలు లేవు సంపాదన లేదు...కాని అతని కూతురు యుక్తవయస్కురాలు అవుతుంది. యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి సహజంగా తోడు కోరుకోవటం సహజం.....
శంకరశాస్త్రి తో స్నేహాతీతంగా మాటమంతి జరిపే అల్లు గారు...శంకరశాస్త్రి కూతురు రాజ్యలక్ష్మి ని తీసుకుని అన్నవరం వెళ్ళటం...అక్కడ గుడి ప్రాంగణంలో చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల కలయిక తద్వారా ఓకరంటే ఓకరు మరులు కొలిపి అభిమానం కలిగి ఉభయుల మధ్య ప్రేమ పుడుతుంది....కాని సాంప్రదాయ కుటుంబాలు అవటం వలన ఆ ప్రేమ గుడి ప్రాంగణంలోనే విరామం....కాని అల్లు వారు చంద్రమోహన్ నే పెళ్ళి చూపులకు ఆహ్వానిస్తారు కధా పరంగా...ఇక పెళ్ళి చూపులలో మరలా చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల పునః పరిచయం...కాకపోతే ఇద్దరూ వధు , వరుల గా ఓకరికొకరు పరిచయం.... దానితో ఇద్దరి మనస్సులో అన్నవరం తాలుకు తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని...ఓకరంటే ఓకరు ఆసక్తి అనురక్తి తో ఉత్సాహంగా వున్నారు....ఆ సమయంలో... సాంప్రదాయ అనుసారం వధువు కి గల అర్హతలు పరిశీలనలో ఓక పాట పాడమంటే...రాజ్యలక్ష్మి...
సామజవరగమన పాట పాడుతుంది...
**********
సామజవరగమనా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
ఆ ఆ ఆ...
సామనిగమజసుధా ఆ ఆ ఆ...
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామజవరగమనా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
మధురలాలసల మధుప లాలనల
మధురలాలసల మధుప లాలనల
పెదవిలోసి మధువులాను వ్రతము పూని జతకు చేరగా
నిసా దనీ మదా గమా
సమమగ గదదమ
మనిసద నసదమ గససని నిగగస
సనినిద దనినిస మదదని గమదని గమదని
సనిద మగసా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా ఇలా…
ఈ విధంగా జరుగుతున్న సన్నీవేశంలో శంకరశాస్త్రి " శారద" అనే పెద్ద కేకతో సన్నివేశం మొత్తం రసాభస అవుతుంది... శంకరశాస్త్రి తన కుమార్తె ను నీవు పాడుతున్న రాగం ఏమిటి... దాని ఆరోహణ అవరోహణ ఏమిటి అనే విషయంతో ప్రేక్షకుడు అది రాగం తప్పుగా భావిస్తాడు...కాని కఠోర సాధనతో మనస్సు నిగ్రహపరచి సంగీతం పాడుతుంటే...యుక్తవయస్కురాలు అయిన
రాజ్యలక్ష్మి , చంద్రమోహన్ పై ఆసక్తితో పాటలో తన భావిజీవితాన్ని ఊహించుకోవటం... తద్వారా ఇల్లాలుగా తన మధురోహలతో తనపై తాను అదుపు కోల్పోవుతుంది...దానితో రాగ ఆలాపనలో స్వరం తప్పుగా పాడుతుంది....
ఇదంతా పరిశీలిస్తున్న శంకరశాస్త్రి తన కుమార్తె మానసిక పరిస్థితి తదుపరి దేహపరిస్థితి అవగాహన వచ్చిన వాడు...కాని పెళ్ళి చేయలేని ఆర్ధిక స్థితి...కాని కుమార్తె వయస్సు వచ్చినందున ఎదుట వున్న వరునితో తన భావిజీవతం అనే భావనతో కుటుంబ సాంప్రదాయ కట్టు దాటిపోతున్న విషయం పరిగణలోకి తీసుకున్న దర్శకుడు... దాన్ని నర్మగర్భంగా రాగం పై మరలచి....నీవు నీ స్వాధీనం లో వున్నావా అని కుమార్తె ను అన్యాపదేశంగా ప్రశ్నించారు......
ఇలా ఈ చిత్రం లో మన దృశ్యమాన విషయం వేరు...అంతఃకోణంలో వివరం వేరు....
ఇది ఓక పరిశీలన మాత్రమే....
ఇక శంకరాభరణం సినిమాలోని సామజవరగమన పాట...పల్లవి , మకుటం త్యాగరాజకీర్తన లోనివి తదుపరి భావవ్యక్తీకరణ పార్ట్ వేటూరి సుందరరామ్ముర్తీ రాసినది.....
ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సామజవరగమన గురించి వివరించాలని వున్నా వివరించలేని పరిస్థితి.... అది సీతారామశాస్త్రి మాత్రమే చెప్ప తగ్గరు....
ఇది నా పరిశీలన మాత్రమే....
సర్వులకు శ్రీరామ జయం.
మీ అభిప్రాయాలను తెలపవలసినది
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
9440172262.
మీ ఖండనలు , విమర్శలు కై ఎదురుచూపులు...
సత్యనారాయణ వ్రతం విశిష్టత అంతరార్ధం
సత్యనారాయణ వ్రతం విశిష్టత.
కార్తీక మాసంలో ను , మరి
విశిష్ట సమయంలో సర్వ బాహుళ్యం వారి నివాసంలోను , అన్నవరం లోను , వనభోజనం సమయంలో వ్రతం చేస్తారు కాని వీరిలో ఒక్క శాతం వారికి కూడా దీని విశిష్టత పై అవగాహన లేదు. మరి నేను నా కోణంలో తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే అని గ్రహించ ప్రార్ధన.
మనకున్న అనేకానేక పూజా విధానములలో సత్యనారాయణ వ్రతం ఎంతో విశిష్టత కలది.
సహజంగా అందరు వివాహంతో గృహస్థులు కాగానే చేయి మొదటి దైవ కార్యం. చాలా మంది ఆసక్తిగా చేసినా తదనంతరం పరిణామం లో కొంత ఆసక్తి తగ్గుతుంది దానితో యాంత్రికత కలుగుతుంది. కాని వ్రతం శ్రద్ధగా చేయివారికి కొంగుబంగారంగా స్వామి వారిని కరుణిస్తారు అనటంలో సందేహం వలదు.
ఈ వ్రతం స్మార్త విధానంలో గణపతిపూజతోను వైష్ణవవిధానంలో విష్వక్సేన పూజతో ప్రారంభం.
అ తరువాత వ్రత కధ ప్రారంభం.
ఈ వ్రత కధ ఐదు అధ్యాయాలు కలదిగా బహుళ ప్రచారంలో వున్నను ఇది 9 అధ్యాయాల వ్రత కధ. ఇందు మొదటి ఐదు కధలు పూజ సమయంలోను. తదుపరి నాలుగు కధలు వ్రతం ముగిసిన తరువాత రాత్రి సమయంలో భగవత్సేవ కైంకర్యం సమయంలో వినాలి అని నిర్దేశించారు. మరి ఏ సమయంలో ఏ పెద్దలు ఈ క్రతువును ఐదు కధలు కలదిగా మార్చే సంకల్పం చేసి కల్పోక్తపూజవిధానంగా మార్పు చేసి సుజనరంజకము సుభోదకముగా చేశారనుటలో సందేహంలేదు.
ఈ విధానం మొత్తం రెండు భాగాలుగా విభజన. ప్రధమ భాగం దేవత ఆహ్వానం , వ్రత కధ రెండోవ భాగం.
ఈనాడు గృహస్థులు యాంత్రిక తో చేయిచున్నారు కాని వారికి అవగాహన వున్న శ్రద్ధగా చేయగలరు అనుటలో సందేహం లేదు. దేవతా ఆహ్వానం ను మండపారాధన అంటారు. సాధారణంగా మనం గృహమునకు అతిధి వస్తే ఆసనం,నీరు లాంటి మర్యాదపూర్వక చర్యలు చేస్తాం కాని నేడు మనం దేవాది దేవుడు అగు సత్యనారాయణ స్వామిని, మన వ్రత ప్రదేశం నకు స్వామిని అర్చారూపకంగా ఆహ్వానం పలికి కలశరూపంలో స్థాపన చేయిటయే మండపారాధన.
ఈ మండపారాధన కు, ఓ క్రమ పద్ధతి వున్నది.
వ్రతం ప్రదేశం నందు చక్కగా రంగవల్లులు తో తీర్చి ఆపై అరటిఆకు గాని , వెడల్పయిన పీటగాని వేసి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై ప్రాణం జీవనాధారం అగు ధాన్యం (బియ్యం) ను పరిచి
ఆపై గణేశాది పంచపాలకులు (గణపతి , బ్రహ్మ, విష్ణు, రుద్రుడు,గౌరి) తదనంతరం నవగ్రహాలు వాటి తాలూకు అధి దేవతా ప్రత్యధిదేవతా సహితంగా వీరిని క్రమంలో సమంత్రకంగా ఆహ్వానం చెపుతూ వారి వారి గ్రహ యొక్క శక్తి మన దేహంపై మన నిత్య జీవితంలో ఏవిభాగం పై వుంటుందో తెలుపుతూ ఆహ్వానిస్తారు.
(సూర్యుడు - ఆత్మ - అగ్ని - రుద్రుడు
చంద్రుడు - మనస్సు - ఆపః - గౌరి
కుజుడు - రోగ, - భూమి - క్షేత్రపాలకం.
బుధుడు - బుద్ధి - విష్ణుం - నారాయణం
గురువు - సంతానం - బ్రహ్మణం - ఇంద్రుడు
శుక్రుడు - కళత్ర - ఇంద్రాణి - ఇంద్రమరుత్తులు
శని - కర్మ - యమం - ప్రజాపతి
రాహువు - చక్షువు - గామం - సర్వాంగ
కేతువు - మోక్ష - చిత్రగుప్తుడు -బ్రహ్మణం)
తదనంతరం అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, క్షేత్ర పాలకుడు,భూమి,ఆకాశం ఇలా సమస్త దేవతలను వారు ,వారి కుటుంబ ,పరివారం,వాహనం,ఆయుధసమేతంగా విచ్చేయమని సమంత్రకంగా ఆృహ్వానిస్తూ వారి వారి స్థానాలకు వారిని ఉపస్థితులను కావింప చేయాలి.
మరి వీరితో పాటు గృహస్థులు యెక్క జన్మనక్షత్రం అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆహ్వానం. దీని వలన గృహస్థులు కు గోచార రీత్యా క్షేమం.
మరి వీరందరి ఆహ్వానంనకు ప్రతి ఒక్కరిని
ఓ తమలపాకు పై వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, అక్షింతలు, రూపాయికాసు సహితంగా ఆహ్వానం చేస్తాం. ఇందు వక్క దేవతాంశ గాను , పసుపు కొమ్ము దేవతాంశ స్త్రీ రూపం గాను ఖర్జూరం నివేదనగాను , అక్షింతలు వారికి అర్చన గాను , రూపాయి కాసు హిరణ్యరూపకంగాను (పాపం మన వాళ్ళు ఈ రూపాయి కాసు అయ్యవారికి వెళుతుందని లోభిస్తారు ) ఇది లోపం లేకుండా వుండాలి.
కారణం విశ్వాంతరాళలలోనుండి వచ్చే దేవతలకు వారి పరివారాలకు ఆహ్వానం పలుకుటలో మనకు తెలియని లోపాలను నివృత్తి కై మరియి వారి నిమిత్తం దాన, దక్షిణకై...
ఇలా ఇవి అన్ని కలిపి సుమారు 50 పైగా అవుతాయి. ఇలా వీరందరి మధ్య స్వామి ని కలశరూపకంగా సకల నది జలాలు సకల దిజ్మండలాల మధ్య సకల పరివారం సహితంగా శ్రీ సత్యనారాయణ స్వామి ని ప్రతిష్ట చేస్తాం.
తదనంతరం స్వామి పురుష సూక్త పూజ , ఆ తదుపరి స్వామివారి రూపును పంచామృత అభిషేకం మన్యుసూక్తసహితంగా చేసి తదనంతరం స్వామి వారి అష్టోత్తర, సహస్రనామాలు తో స్తుతించడం తదనంతరం లక్ష్మీ దేవిని అష్టోత్తర పూజలతో వ్రతం నందు మొదటి భాగం పూర్తి.
తదుపరి వ్రతం యొక్క ఉత్తర భాగం కధ భాగంలో అడుగు పెడతాం.
మనం ఇప్పటి వరకూ వ్రత విధానం తెలుసుకున్నాం. మరి స్వామి వారు ఎవరు మన వ్రతం యెుక్క లక్ష్యం,ప్రసాదం మహిమ ఏమిటి చేస్తే వచ్చే ఫలితం ,చేయగలమని అనుకోని చేయకపోవటులో ఇబ్బంది తెలుసుకోవటమే కధ రూపకంగా.
* ప్రధమ అధ్యాయం*
వ్రతం ప్రధమ కధ నందు.
నైమిశారణ్యం నందు సూతమహాముని శౌనకాది మహర్షులు కు మానవులు కష్టనష్టాలు తీర్చుటకు తరుణోపాయం అన్న వ్యాఖ్యలు తో కధ ప్రారంభం .
ఈ సకల చరాచర విశ్వం నందు జీవంతో కలిగిన గోళం ఒక్క భూగోళం మాత్రం...ఇందు గల అనేకానేక జీవావరుణంలో మానవుడు మాత్రమే అన్య ప్రాణులకు భిన్న ప్రకృతి కలవాడై వున్నాడు. బుద్ధి మనస్సు వాక్కు కలిగిన వాడుగా వున్నాడు. మిగిలిన ప్రాణులు ఇవి లభించక తమ మనుగడకు ప్రకృతిపై ఆధారపడి ప్రకృతిలో ఒకటిగా మనుగడ సాగిస్తున్నాయి కాని మానవుడు తన భిన్న ప్రకృతి చే తనకు గల విశిష్టత ను వినియోగం పరిచి ప్రకృతి ని తన ఆధిపత్యాన్ని కి తెచ్చుకుని పంచ భూతాలయిన వాటిని తనకు అనుకూలమైన వినియోగం మైన విధముగా చేశారు.అయనను అతని ఆశ తీరిక ఇంకను ఇంకనూ అన్న స్వభావం వలన అతని జీవన పరిణామం క్రమం తప్పి అనేక కష్టనష్టాలను చవి చూస్తున్నాడు . దీని వలన మానసిక సంతులనం కోల్పోయి దిగులుగా ఇబ్బంది గా వున్నాడు...
ఈ సమయంలో నారదమహర్షి భూలోకం సంచారం చేయిచూ పై విషయాలను వైకుంఠ వాసుడైన విష్ణువుతో ప్రస్తావన...
ఆసమయంలో స్వామి వారి వర్ణన ....
స్వామి వారు తన అంశం రూపం అయిన సత్యనారాయణ వ్రతం చేసిన మానవుల కష్టాలు దూరం అవుతాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అంటారు.
ఇక్కడే మన పూర్వీకులు మహర్షులు చమత్కారం మనకు తెలియజేస్తుంది...
సాధారణ మానవుడు భోగలాలసతో జ్ఞాన శూన్యతతో భగవంతునికై కృషి సల్పుటలో అలసత్వం తో వుంటారు. మరి వారి మోక్ష ప్రాప్తి కి కొన్ని రకాల వ్రతం ,నోములు, పారాయణలు ప్రవేశం ...వీటి అన్నింటిలోను ఉత్తమమం నామధ్యానం....
అసలు నారాయణుడు అంటే ఎవరు?
మనం నారాయణుడు విష్ణ్వంశగా భావిస్తాం.
ఈయన పని లోక పాలన...
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్ అన్ని భాగవత వాక్యం అనుసరించి
ఆయన మహ పురుషుడు...మరి ఆయన నామం రూప ధ్యానమే సత్యనారాయణ వ్రతం అన్నది రహస్యం.
సత్ + య + నారాయణ అన్న పద సముచ్ఛయం సత్యనారాయణ గా వాడుక.
ఇందు సత్ అన్ని పదానికి అర్ధం ఎల్లప్పుడు , సతతం , అన్నివేళలా అని......
యం అన్నది మన దేహం నందు గల కుండలిని చక్రంలోని అనాహత చక్ర బీజాక్షరం.
ఈ అనాహత చక్రం దేహం నందు
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.
అనగా నారాయణ అన్న నామమును హృదయమందు ప్రతిష్టించుకోవాలి.
ఇంకను వ్రతం విధానం తెలుపుట మొదటి అధ్యాయం నందు కలదు. ఏ ఏ కాలాలు చేయాలి, ఏ విధంగా చేయాలి కావలసిన వస్తువులు అన్ని తెలుపుతుంది .
*రెండవ అధ్యాయం*
ఈ అధ్యాయం నందు
కాశీ పట్టణం నందు శతానందుడు అను బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వాడయినను ఉపాధి లేక అనేక కష్టనష్టాలను చవి చూసి భగవత్ కృప వలన ఈ వ్రతం చేయిట మరియి ఈయన ను చూసిన కాలకష్ఠుడు అనే కట్టేలు కొట్టే వాడు అతని శక్త్యానుసారం చేసి తరించుట.
చూడండి శతానందుడు అన్ని రకాల ఆనందాలు అన్నది నామధేయం లో , విద్య కలవాడు కాని ఉపాధి లేకపోవటమే పెద్ద కష్టం...
కాలకష్ఠుడు అనేది దురదృష్టవంతుడు అనే పదానికి పర్యాయ పదం.
ఇటువంటి పరిస్థితుల్లో వున్నవారు స్వామి వారి వ్రతం చేసిన వారి కష్టం నివారణ జరుగుతుంది అని తెలుపుట రెండవ అధ్యాయం అంతరార్ధం.
*మూడవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు ఉల్కాముఖుడు అను రాజుగారి రాజ్యం నందు ఒక వైశ్యుడు ఈ వ్రతం కధ తెలుసుకుని సంతానలేమి చే బాధ పడుతున్న అతను భగవంతుని కృపచే సంతానం లభించటం అయినను వ్రతం చేయక వాయిదాలు వేయటం అలా తన కుమార్తె వివాహం సమయంలో కూడా వాయిదా వేసి తన సంపాదన నిమిత్తం చంద్రకేతు మహరాజు
పరిపాలనలోని రత్నసానుపురం వెళ్ళుట...ఇలా దైవ ధిక్కారం నకు పాల్పడుటతో అతని కుటుంబం ,అతను అనేక కష్టాలు గురి అవటం...దీనికి తరుణోపాయం గా వ్రతం చేసిన
కష్టాలు తీరును అన్న బుద్ధి కలిగించును...
ఈ క్రమంలో వ్రతం నిర్వాహణా లోపం శ్రద్ధాలోపం భక్తి లోపం వలన కలుగు ఇబ్బందులు తెలుపుట ఈ అధ్యాయం యెక్క ఉద్దేశ్యం.
*నాలుగవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు పై అధ్యాయం పాత్రలే వారి తప్పులు మన్నించి స్వామి వారు తరుణోపాయం చూపుట.
భగవంతుడు భక్త సులభుడు మీకు దొరుకు సహాయం ఆకాశవాణి గా అన్యాపదేశంగా అజ్ఞాతం గా జరుగగలదని తెలుపట ఈ అధ్యాయం యెక్క లక్ష్యం.
*ఐదవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు తుంగధ్వజ మహరాజు అడవికి వేటకు వెళ్ళి ఆ సమయంలో అడవిలోని గొల్లవారు స్వామి వారి ప్రసాదం ఇవ్వగా వారు అనాచారులు అని ఆక్షేపణ చేస్తూ ప్రసాద్ స్వీకరణ చేయక నిర్లక్ష్యం వహించిన దైవ ఆగ్రహంనకు గురి అయి రాజ్యం ,సంతానం పోవటం అన్న కష్టం నాకు గురి అయి దైవజ్ఞల వలన ప్రసాద్ స్వీకరణ నిర్లక్ష్యం అని తెలుసుకుని తప్పు సరిదిద్దుకునటచే స్వామి వారిని కరుణించుట.
ఈ అధ్యాయం లో ధర్మ సూక్ష్మం తుంగధ్వజుడు అన్న పేరుతో తెలిపారు. తుంగ ఎంతటీ నిస్సారవంతమైన భూమిలోను కూడా పెరుగుతుంది అంతేకాక తను పెరిగిన భూమి నిరుపయోగం అవుతుంది.
అలాగే ధ్వజం అనగా జెండా.
మనిషిలో అహంకారంతో, అధికార , ధనమదంతో
దైవదూషణ ధిక్కారం చేస్తే తగిన ఫలితం అనుభవిస్తారని తెలుపుట, భగవంతుని సన్నిధిలో రాజు పేద అన్నది లేదు కావలసినది శ్రద్ధ, భక్తి మాత్రమే.. అలాగే స్వామి వారి వ్రత ప్రసాదం నందు నిర్లక్ష్యం కూడదు అని తెలుపుట.
శ్రీరామ జయం.
****************************************
మిత్రులు నమస్కారం.
ఇందు తప్పు ఒప్పు లు మన్నించి మీ సమాధానం పంపగలరు.
Send your feedback to
Alapati Ramesh Babu
9440172262.