10, జూన్ 2012, ఆదివారం

ఇషా ఫౌండేషన్,కోయంబత్తూరు - తీర్ధకుండ్ -ధ్యానలింగ - లింగ భైరవి - అనుభవాలు

ఇషా ఫౌండేషన్, కోయంబత్తూరు వద్ద సింగనల్లూరుగ్రామము వద్ద శ్రీ సద్గురు జగ్గీవాసుదేవ్ స్థాపించిన యోగగ్రామ ఆశ్రమము. ఈ సెంటర్ పూర్తిగా మానవత్వ పరిమళాలు వెదజల్లుతుంది.మీరు ఒక్కసారి దర్శించారంటే మీతాలుకు ఎన్నో మానసిక వత్తిడులు,విచారాలు,దుఃఖాలను మరచి మిమ్ములని మీరు పొందామ అన్న అనుభూతి కలుగుతుంది.అనేక వేల మంది ఉన్నత విద్యావంతుల, యోగ సాధకుల ఆలొచనాల సారాంశమే ఈ ఇషా.ఇది ప్రపంచములోని 150పట్టణాలలొని 2 మిలియన్ ప్రజలు రాకపొకలు సాగిస్తుంటారు.దీని ముఖ్యొద్దేస్యము గ్రామీణపునరుజ్జీవనము,సతత హరితము,విద్య వీటికి తగ్గ ప్రణాళికలతో అనేక వేల మంది వలంటీర్ల తొడ్పాటుతో ముందుకు పొతున్నారు.

ఇషాను స్థాపించిన శ్రీ జగ్గీవాసుదేవ్ కూడా చాలాభిన్నముగా దర్శనమిస్తారు.మాములు యతి,స్వాములు ధరించే కాషాయవస్త్రధారణలో కాక సాధారణ మానవుడులా నేను మిలో ఓక్కడినే అనిపించెలా టీషర్టులు,జీన్స్ ధరించి కాళ్ళకు స్పొర్ట్స్ షూస్ తో మనకు దర్శనమిస్తారు.అలాగే టీచింగ్స్ కూడా సనాతనము నుంచి అధునికము దాక అవసరమయినవి అన్ని వారి పద్ధతిలో బొధిస్తుంటారు.



ఇషా ఫౌండేషన్  నందు ముఖ్యముగా మన మనస్సును ఆకట్టుకొనేవి తీర్ధకుండ్,ధ్యానలింగము,లింగభైరవి.ఈ 3 ప్రదేశాలు ప్రతి ఒక్కరు దర్శింపతగినవి.

తీర్ధకుండ్ : ఇది భూమికి షుమారు 40 అడుగులలొతులో వున్న ఓక సహజ సిద్ధ జల కుండము. ఈ కుండమునకు పై నుంచి ఆధునిక సాంకేతిక సహాయముతో నీరు పరిశుద్ధపరచి సరఫరా చేయబడుతుంది.నీరు క్రిష్టల్ క్లియర్ అంటే ఆశ్చర్యపొవలిసిన పనిలేదు అంత శుద్ధము.నీరు చాలా చల్లగా జిల్ జిల్ మంటాయి.ఈ నీరు ఒక జలపాతములా కుండములోకి అలా పైనుంచి పడుతుంటాయి.ఈ తీర్ధకుండ్ లో మనము స్నానము అడేముందు పైన వున్న బాత్ రూంస్ నందు స్నానము అడి వారు ఇచ్చు ప్రత్యేక అంగవస్త్రముతో దిగవలసి వుంటుంది.ఇక్కడ ఆడవారికి,మగవారికి విడివిడిగా సమయాలు, వస్త్రధారణలు.ఈ తిర్ధకుండ్ లోతు 3"అడుగల నుంచి 6"అడుగుల వరకు వుంతుంది కాని మీరు మునిగిపొతారు అన్న భయములేక ఇక్కడ వలంటీర్లు సిద్ధముగా వుంటారు.ఆడవారికి,మగవారికి వేరువేరుగా ప్రతి 30నిముషములకు ఒక్కసారి అవకాశము. అలాగే వలంటిర్లు కూడా వేరువేరు.          

అన్నిటికన్నా ముఖ్యమయినది ఈ తీర్ధకుండము మధ్యన ప్రతిష్టించిన పాదరసలింగము.ఈ పాదరసలింగము దాదాపు షుమారు 500కిలొగ్రాముల పైనే కాని లొపు వుండదు అంత పెద్ద లింగాన్ని, పాదరసమును  అత్యంత అల్పపీడనములో శీతలికరించి లింగరూపముగా ప్రతిష్ట.ఇది రసలింగము.(పాదరసము - శివుని వీర్యమంటారు) ఈ రసలింగాన్ని పానవట్టముపై  ప్రతిష్టించగా ఈ మొత్తము జలాశయ మధ్యలో వుంటే మనము సాక్షాత్ ఆకైలాసనాధుని జలాభిషెకములో స్నానమాడుతున్నమా లేక జలాభిషేకములో పునీతము అవుతున్నామా అనే ఆనంద సందేహడొలికలు.ఆ కైలాసనాధ జలాశయములో మనము దిగి  శివశివ హరహర అని మునకలేస్తూ రసలింగాన్ని మార్కండేయుడు కౌగిలించుకున్న రీతిలో ఆశివయ్యను పట్టుకుంటే మనశరీరములో వున్న జన్మజన్మ సంస్కార మలినాలు,మనోమాలిన్యాలు, శారిరక రుగ్మతలు అనేక జడత్వాలు  మనలను వదిలిపొతాయి.మనదేహము, మనస్సు  లింగమునకు అప్రయత్నముగానే క్షణమాత్రములోనే వశ్యులమయి పొతాము.మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజము .స్వయముగా అనుభవిస్తేనే కాని తెలియని ఒక వింత అధ్యాత్మికనుభూతి.హరహర అంటూ నీటిలో మునిగి శివశివ అని పిలుస్తూ తలను పానవట్టము పైన వుంచితే మనస్సు మరలా మరలా అని ఉరకలెత్తుతుంది.(ఇది నా స్వానుభవము,నీరు అంటే భయ పడే నా భార్య కూడా ఇదే అనుభవము)            

ధ్యానలింగం : తీర్ధకుండములో పవిత్రమయిన తరువాత అక్కడకు దగ్గరలొనే వున్న ధ్యానమందిరములో వున్న ధ్యానలింగం ను దర్శించాలి. ఈ మందిరము ముఖ్య ద్వారమునకు ఎదురుగా ధ్వజస్థంభములా ఒక రాతి స్థంభముపై 3 మతాల గుర్తులు,యోగ చక్రాల గుర్తులు చెక్కబది యెంతో ఆకర్షణీయముగా వుంటుంది. ద్వారము నుంచి మందిరమునకు వెళ్ళు మధ్య నడవాలో యోగ శాస్త్రకారుడు పతంజలి, సర్వ మేధకు అధిపతి దక్షిణామూర్తి,ఙ్ఞానసిద్ధికి గుర్తుగా రావి చెట్టు మొదలగునవి కన్నులారా తిలకించవచ్చు.  
ఇక మనము ధ్యానమందిరము నందు ప్రవేసించగానే దీని నిర్మాణకౌశలానికి,పద్ధతికి ఆశ్చర్యచకితులమవుతాము.ఇది భూమి నుంచి షుమారు 40అడుగుల ఎత్తువున్న అర్ధచంద్రాకార గోళము.ఈ అర్ధచంద్ర ఆకారము అనంత విశ్వాన్ని,మానవ మస్తిష్కాన్ని ప్రతిబింబిస్తుందా అనిపిస్తుంది.ఈ మందిర మధ్య భాగము, గోళ కేంద్రభాగము ఖచ్చితముగా  ఒక్కచొటు వచ్చు విధముగా నిర్మించి, ఆప్రదేశములో ప్రాణశక్తి అయిన శ్వాస రూపుడైన సర్పమును పానవట్టముగా వుంచి ఆపై లింగరూపధారిగా పరమాత్మను నిలిపి ధ్యానలింగమనే సరికొత్త మాట అంతకన్నా వినూత్నమయిన పరమాత్మను మనకు సాక్షాత్కరింపచేసారు.
    ఈ ధ్యానలింగము చుట్టూ మానవ ప్రాణాధార జలము రక్తప్రసరణకు,అనేక జీవాత్మలకు, అనంత జలరాశులకు సూచనగా చుట్టూ నీరు.ఆ నీటిలో అణిమాది అష్టసిద్ధులు,ఙ్ఞానకాంక్ష,సహస్రార, సకల లక్ష్మీ రూపాలను ప్రతిబింబిస్తూ ఏరుపు,తెలుపు పద్మాలు. ఇవి నాకు తోచిన భావాలు మీరు దర్శించినప్పుడు మీకు ఇంతకన్నా ఉన్నతభావాలు స్ఫురించవచ్చు.

ఈ ధ్యానలింగము వద్ద ప్రతిరోజు మధ్యాహ్నము12గం లకు నాద ఆరాధన అనే సంగితసహిత, ధ్యాన సహిత అర్చనకార్యక్రమము జరుగుతుంది.ఈ కార్యక్రమమునకు హాజరుకావటము మాత్రము మిస్ కావద్దు.అర్చనలో మంత్రాలు వుండవు ఒక వాయిద్యకారుడు తన వాద్యముతో లయబద్ధముగా సంగితము వినిపిస్తుంటే మందిరములో పరివేష్టితమయిన భక్తులు  ధ్యానరూపుని ధ్యానము చేయటమే అర్చన.ఈ సమూహా ధ్యానము వలన ధ్యానతరంగాలు ఆప్రదేశము అంతటా వ్యాపించి సాధకులను,కొత్తవారిని త్వరగా ధ్యాన స్థితికి తిసుకొని పోతాయి అనేక దివ్యదర్శనాలు లభిస్తాయి.    

లింగభైరవి : మనకు సహజముగా అనేక రూప దేవిస్వరూపాలను చూస్తాముకాని ఈ విధమయిన లింగరూపభైరవి ఇక్కడ తప్ప వేరు చోట కానరాదు. ఇక్కడ భైరవి మనతో భవుడు నేను వేరు కాదు ఇద్దరము ఏకమే  అన్నట్లుగా లింగభైరవి, శివ సంయుక్త ఏకరూప ఆవతారము.లింగ భైరవికి 10 భుజాలు, తీక్ష్ణముగా మనస్సులోకి ప్రసరించే చూపులతో అమ్మవారి కన్నులు.కొట్టవచ్చినట్లు కనిపించే   అమ్మవారి ముక్కుపోగు. అమ్మవారు కాళరాత్రి,కాళి అవతారాములా నల్లని రాతిలో లింగభైరవిగా జగన్మొహనముగా దర్శనిమిస్తుంది.సూర్య చంద్రులు ఈ రూపానికి అభరణాలా అన్నరీతిలో ఇరువైపులా.సకల ప్రకృతి నాచే ఆవరించబడినది,నాచే సృష్టిచబడినది అనాదానికి సాక్షీలా ఆకులు, లతలు.సృష్టిలోని దమనత్వము.క్రూరత్వము ఎప్పటికయినా అణగదొక్కబడేవి అన్న దానికి సంకేతములా లింగభైరవి పాదపీఠములా మహీషము.ఇలా సమస్త,ప్రకృతి,వికృతులు సరళముగా, లలితముగా, హృద్యముగా ఆ శ్రీచక్ర నివాసిని విరాజిల్లేతీరు నభూతో నభవిష్యతి. 
     ఈ లింగభైరవి మందిరములో హారతి కార్యక్రమము విశిష్టత కలది. ఈ కార్యక్రమములో దేవిస్తుతి "యాదేవి సర్వభూతేషు" పూర్తి శ్లొకాలను పాడుతూ హారతి కార్యక్రమము జరుగుతుంది.
ఈ గుడి ప్ర్రంగణములో వున్న చెట్టుకు స్త్రీలు మాంగల్యభాగ్యము గురించి పసుపుకొమ్ము కడతారు. అమ్మవారికి వేపాకు, ఏరుపు గాజులు,వస్త్రము, పసుపు కుంకాలు సమర్పణచేస్తారు.ఇక్కడ వున్న లింగ భైరవి యంత్రము ఓక ఆకర్షణ.      
        


ఇషా ఆవరణలోవున్న పాఠశాల,జగ్గివాసుదేవ్ ప్రవచన హాలును ప్రత్యేక అనుమతితో చూడవచ్చు.ఇషాలో మిరు ఓక్కటి గమనిస్తారు ఇక్కడ ప్రతి అలంకరణ,పూజాసామాగ్రి,స్థూపాలు,నిర్మాణాలు అన్ని సర్ప ఆకృతితో పరివేష్టితమయి వుంటాయి.మానవుడు ఆత్మరూపుడు, ఈ ఆత్మను ప్ర్రాణరూపముగా, ఈప్రాణము శ్వాసగా,ఈ శ్వాస సర్పరూపముగా భావిస్తారు.శ్వాస యోగానికి కేంద్ర బిందువు కాబట్టి అన్నిటా అలా సర్ప ఆలంకరణలు మనకు దర్శనమిస్తాయి.

3 కామెంట్‌లు:

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.